ఎం.నారాయణ శర్మ గారి 'ఈనాటి కవిత' వ్యాఖ్యానం: శీతగానం

కవిత్వం కావాలి కవిత్వం అనుకుంటుంటాం..కాని కవిత్వమంటే..అనే ప్రశ్న చాలా సార్లు..వస్తుంది..ఒక్కో మార్గంలో ఒక్కో రకంగా నిర్వచించు కుంటారు.ఇవన్నీ సరైనవని ఎలా చెప్పలేమో సరికాదనివాదించడానికీ అంతే అవకాశంలేదు.

కవిత్వం కళాతాత్వికభావనలు కనిపించి ఒకసాధారణ దృశ్యాన్ని ప్రతిమగా మహొన్నతంగా అందించాలని కళాతాత్వికులభిప్రాయపడతారు.దృశ్యాన్ని ఆమూర్తంగా కళావ్యాఖ్యానాలు నిలబెడతాయి.ఇందుకు ప్రతీకలు,భావచిత్రాలు ఎక్కువ ఉపయోగపడతాయి.

భావచిత్రం అంటే కనిపించే దృశ్యాన్ని అంతే కళాత్మకంగా వర్ణించడం.దీనికి కవి అందులోని సౌందర్యమూలాలని విడదీసుకుని అనుభవించగలగాలి.మొత్తం వాతావరణంలోని ప్రధాన క్షేత్రాలని తీసుకుని వర్ణించాలి.అలా ఎన్నుకునే అంశాలు కవిచూసిన వాతావరణాన్ని ,దాని సౌందర్యాన్ని ప్రదర్శించగలగాలి.తాననుభవించినదాన్ని అంతే సౌందర్యంగా పాఠకులకు చేర్చాలి.

మరువం ఉష శీతాకాలంలోని ఉదయంలో కనిపించే వాతవరణమ్నించి రెండుదృశ్యాలను,రెండు శబ్దాలను చేదుకుని కళాత్మకంగా ఆదృశ్యాలను వ్యాఖ్యానించి కవిత్వం చేసారు,ఉదయంలోని రాలుతున్న మంచు,కొద్దిగా రంగు రంగుల్లో విస్తరిస్తున్న వెలుగురేఖలు...ఆసమయంలో ఎగురుతున్న పక్షుల రెక్కలచప్పుడు,కదులుతున్న కొమ్మలచప్పుడు ఈవాతవరణాన్ని చిత్రించిన కవిత ఇది.

"మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు...
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే"

"లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ"

"ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను. "

మంచుని మడతవిప్పిన చీర-గా .తొలి కిరణాలని ఇంద్రధనుస్సులో ముంచితీసిన కుంచెగీతలు-గా చెప్పారు..అట్లే శబ్దాలని రెక్కల హోరులా ,ప్రకృతి నట్టువాంగంలా ఉందని అన్నారు.

ఇందులో మంచినిర్మాణంకూడా ఉంది.మొదటివి రెండు దృశ్యాన్ని ప్రకటిస్తే మూడవవాక్యం తన అనుభవాన్ని చెప్పింది.ఇందులోని రెండవభాగంలో లోనూ ఈనిర్మాణం ఉంది కాని ఇందులో శ్రవణానుభవాన్ని ప్రకటించారు.
కాళిదాసు-"ఉద్గాస్యతామిచ్చతి కిన్నెరాణాం తానప్రదాయిత్వమివోపగంతుం"అన్నాడు.-హిమాలయాలలో వీచేపిల్లగాలుల సవ్వడి కిన్నెరలగానానికి కోరస్ లా ఉందని భావం..ప్రకృతితో స్నేహం చేస్తేనే ఇలాంటి అల్లికలు సాధ్యమేమో.-స్నేహమంటే 
చూడటం,వినటం,స్పర్శించటం,దాని గురించి మాట్లాడటమని దానికోసం మనసు ఆరాటపడటమని నీతిశాస్త్రం చెప్పింది.

"దర్శనే స్పర్శనేవాపి శ్రవణేభాషనేపివా
యత్రద్రవత్యంతరంగః సస్నేహ ఇతి కథ్యతే"

ఆస్నేహంలోంచి మంచి భావచిత్రాన్ని కవితగా అందించినందుకు ఉష గారికి అభినందనలు

*****
-శీతగానం-

మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు... 
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే

లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ 

ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను.  
(28/12/2013)

4 comments:



  1. మానోటి పలికె మధురిమ
    ఈ నాతి కవిత జిలేబి యీభువి జూడన్
    ఈ నాటి కవిత లిచటన్
    తానే సరళముగ వచ్చె తరుణీ మరువం !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నెనర్లు! మీ పద్యాలకి తాత్పర్యం మననం తో వెదుక్కోడానికి ఇంత జాప్యం! నా బ్లాగు వ్రాతల 8వ వార్షికోత్సవము కూడా అనుకోకుండా దాటేసింది...

      Delete
  2. ఉష గారూ, ఈనాటి కవిత అనే పుస్తకంలో నారాయణశర్మ గారి వ్యాఖ్యానమనుకుంటాను.
    చాలా చక్కటి వ్యాఖ్యానం. మీకూ వారికి అభినందనలు.
    ఈ మధ్యనే కృష్ణశాస్త్రి గారి కవిత్వం మీద వారి వ్యాఖ్యానం చదివి కలిగిన నిరాశ ఇక్కడి పోస్ట్లో విషయంతో తీరింది. :)

    ReplyDelete
    Replies
    1. మీ మెచ్చుకోలు కి నెనర్లు. అవునండీ, కాకపోతే ఈ వ్యాఖ్యానం 12/2003 లో ఆయన ఒకటొకటిగా వ్రాసినప్పటిది... పుస్తకం వెలువడింది కనుక ఈ భాగం పంచాను నాకూ కాస్త భాగస్వామ్యం ఉందని. కవిసంగమం లో కొద్దిపాటి అక్షరాల వలన తెలియటమే, కానీ, ఆయన వ్రాతలపై అభిప్రాయం తెలిపేంత స్థాయి లేదు.

      Delete