యాత్ర దేముంది - తూర్పు పడమర నడుమ ఏదో ఉంది

ఆ క్షణం   
రేగి పళ్ళు మాగిన వేళలో 
నేరేడు కొమ్మలు బరువుగా వాలిన వుదయాలలో 
నిమ్మ పూల మీదుగా కదిలిన గాలిలో
నేను నిన్ను పునర్దర్శనం చేసుకున్నాను

చేమంతి మందారాల రంగుల జుగల్బందీ ముగిసాక
జాజులు మల్లెల పోరు మొదలయాక 
మామిడి పూత దాచిన భరిణె మూత బిగించాక 
రసాల కాయల హోరు వాడలకి వచ్చాక
నన్ను సాగనంపే సమయంలో 
ఆకాశం వర్షించింది

నిన్ను హత్తుకుని ఒదిగిన చెమ్మ 
నన్ను చుట్టుకుని వున్న ఆత్మీయత 
ఉమ్మడి బంధం నా కొంగు బంగారం

నేల తల్లీ, 
నీ స్పర్శ కోసం తిరిగి వస్తాను..
సశేషమైన చరితలు రాసుకుని మోసుకొస్తాను 
పాటల పోత పోసిన పిట్టనై నర్తిస్తూ 
మళ్లీ కొత్త రాగం తో పాదం కదుపుతాను

-----

ఈ క్షణం
కోయిల పాట కార్డినల్ గొంతులో ధ్వనించింది
చేమంతి వన్నె తిరిగి చేరుకుంది
ఆ సీమలో వేడికి జడిసిన శీతల పవనాల జాడ 
ఈ నేల మీద తెలిసింది
నేస్తాలు నిండు గా ఆహ్వానం పలికాయి..

తూగుడుబల్ల మీద మనసు మాత్రం 
తూరుపు పడమరల నడుమ ఒరుగుతూ వుంది

సీమాంతర యానాలు అంత సులువుగా వెనకపడవు-
వెంటవెంట వస్తుంటాయి.
అడుగులతో సాగే ఒంటె మెడలో గంటల సడి
ఎడారి దిక్కుల్లో ఆగి ఆగి తరలినట్లుగా
నిమిషాలు నడిచి వెళ్లి పోతున్నా 
జ్ఞాపకాలు ప్రతిధ్వనిస్తూ 
మరి కాసేపు ఆగుతున్నాయి…

No comments:

Post a Comment