Showing posts with label కథ. Show all posts
Showing posts with label కథ. Show all posts

పూలు గుసగుసలాడేనని ~




అనగనగా డైనోసార్స్, ఏప్స్ కి పూర్వం, మనుషులు పుట్టక మునుపు రెండు కుసుమాలు, అక్కాచెల్లెళ్ళు వాహ్యాళికి వెళ్తారు. ఆలా చాలా దూరం నడిచాక వాళ్ళొక అందమైన లోయ ని చేరతారు. అప్పుడు చెల్లి సుమం అక్కని "మనమింకా నడవాలి కదా? ఈ లోయకి అవతల యేముందో చూడాలిగా," అని అడుగుతుంది . "నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వు వెళ్ళి తిరిగిరా," అంటుంది అక్క. చెల్లి ప్రయాణమై బయల్దేరుతున్నపుడు పెద్ద విరి చెల్లి పూవుతో "నువ్వు తిరిగి వచ్చేప్పటికి నన్ను మర్చిపోతావా?" అని అడుగుతుంది. పయనమై వెళ్ళిపోతూ చిన్ని పువ్వు లేదంటూ సమాధానమిస్తుంది.
చాలా కాలం గడిచాక ఆ చిన్న పువ్వు ఎదిగి ఒక అందమైన అమ్మాయి గా మారుతుంది. ఆ అమ్మాయి ఒకరోజు ఆ పాతలోయకి పూలు కోయటానికి వస్తుంది. ఆమె ఒక దేవగన్నేరు కొమ్మ విరిచి ఆ కుసుమాన్ని తీసుకున్నప్పుడు ఆ పూలమొక్క గుసగుసగా "నన్ను మర్చిపోయావు ప్రియతమా?" అని అడుగుతుంది.
( I translated this story from Veettilekkulla Vazhi (The way to home) Malayalam movie I recently watched. This story is told to a 5yr old boy. The clip is from 1:10:25-1:11:45 I like to extend my thanks to Ken&Thuong that provided the subtitles.)

తాతయ్యలు చెప్తున్న కథలు - Ancestral Stories of India from AGII

Association of Grandparents of Indian Immigrants (AGII), a registered nonprofit organization, is dedicated to the production of audiovisual materials for the families of Indian Immigrants. Carefully selected stories, depicting India's glorious past, are narrated in English with music and sound effects.

This brings to life, using modern multimedia techniques, the still pictures of the famous Amar Chitra Katha series, yet preserving the educational values of our productions. They have nearly 300 stories captured in 50 DVDs (each of 120 minutes duration).

Click here to watch free downloads of streaming videos. ( http://www.agiivideo.com/DownloadVideos.htm )

Here is the list of complete set of DVDs - http://www.agiivideo.com/CurrentList.htm

Read their sincere appeal for encouragement and support - http://www.agiivideo.com/OrderingOnline.htm

విలువైన వారి సమయం ఇలా వెలకట్టలేని వీధికి వినియోగిస్తున్న ఆ తాతలందరికి నమస్కరిస్తూ...

(పిల్లల కోసం) భీష్మ ఏకాదశి : విష్ణు సహస్ర నామం పుట్టినరోజు

నా దగ్గర MAHABHARATA, DREAMLAND PUBLICATION పిల్లల వర్షన్, ప్రయాగ రామక్రిష్ణ గారి 'భారతంలో చిన్న కథలు' ఉన్నాయి. మీ ఎవరికైనా ఇతరత్రా పుస్తకాలు/వివరాలు తెలిస్తే పంచుకోండి, ప్లీజ్. ఇక్కడ చెప్పినా లేదూ ushaa డాట్ raani జీమెయిలు ఐడికి పంపినా సరే.

/************************************************************
ఈ ఏడాది నాన్న గారు గుర్తు చేస్తేనే సప్తమి, ఏకాదశి తెలిసేంతగా పనిలో మునిగానని కాస్త విచారించి, కనీసం ఇక్కడ పెట్టుకుంటే పై ఏడాదికి రిఫరెన్స్ అని రాసుకున్నాను.
రేపటి క్లాసు కి నా చిన్నారులు, 5-12సం. ప్రాయపు వాళ్ళ కోసమని రాసుకున్న బ్రీఫ్ నోట్స్.
*************************************************************/

మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు "దేవవ్రతుడు". ఇతడు గాంగేయుడు - గంగకి శంతనునికి జనించిన అష్టమ సంతానం. తండ్రి ద్వితీయ వివాహం కొరకు భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడు గా పిలవబడ్డ ఈయనది భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర. కౌరవ పాండువుల పితామహుడు.

తండ్రి ప్రసాదించిన - తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే - వరం ఉన్నందున, కురుక్షేత్ర సంగ్రామం లో (పాండువుల శ్రేయస్సు కోరి, విజయమాశించి, తన పరాజయ/అస్త్రాన్ని అడ్డగల కారణం చెప్పి, శిఖండి ని అడ్డం పెట్టుకున్న అర్జునుని చేత శరాఘాతుడై) అంపశయ్య మీద ఉత్తరాయణం వేచి ఉన్న భీష్మాచార్యుడు రథ సప్తమి మొదలుకుని ఏకాదశి వరకు, రోజుకొక ప్రాణాన్ని త్యజిస్తూ, ఈ భీష్మ ఏకాదశి (మాఘ శుద్ధ ఏకాదశి ) నాడు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని, ఆ మహత్యాన్ని తెలియచేసి, ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.

అనగా అనగా "చెయ్యి" అనే ఆమెకు ఐదుగురు కొడుకులు - అయితే?

అయితే - వాళ్ళే ఐదు వేళ్ళూను - అనేస్తే చాలదు. వేళ్ళ పాటలు (వేళ్ళ లెక్కలు కాదు, వేలం పాటలూ కాదు) పాడిస్తూ, అయిదువేళ్ళు ఐకమత్యానికి చిహ్నంగానో, లేదూ ఐదు వేళ్ళూ ఒక్కలా ఉండవనో, పంచ పాండువులనో ఇలా అమ్మమ్మ, తాతయ్యలు, మామ్మలు, నాన్నమ్మలు చెప్తుంటే పెరిగినవారం చాలామందిమే ఉన్నామని నా అంచనా. ;) ఆ పంధా లోనే, నిజానికి, ఎక్కువ ప్రాచుర్యం లో ఉన్న పాటల సేకరణ చేస్తూ ఇంకాసిని ఎవరైనా ఇవ్వకపోతారాని ఈ పోస్ట్. ఆపై మా బడి పిల్లల కేరింతలు మీకు చక్కలిగింతలు పెడతాయని హామీ!


1. మా మామ్మ నాకు పాడి ఆడించిన/నేర్పిన కిత కితల పాట ఇది.

ఆకేసి (నా అరచేయి చాపించి తన వేళ్ళతో పాముతూ)
అన్నం పెట్టి (నా బొటనవేలు మడుస్తూ)
పప్పేసి (చూపుడు వేలు మడుస్తూ)
చారేసి (మధ్య వేలు మడుస్తూ)
నెయ్యేసి (ఉంగరం వేలు మడుస్తూ)
బెబ్బేసి (చిటికెన వేలు మడుస్తూ) * బెబ్బిఅంటే పెరుగు :)
ఆం ఆం అంటూ తినేసి (మూసిన ఆ గుప్పిటని మూతి వరకు తీసుకెళ్ళి)
సంతకు పోయే దారేది? (తిరిగి నా అరచేయి తెరిచి, తన వేళ్ళు భుజం వరకు పాకిస్తూ, చక్కిలి గింతలు పెడుతూ, నా కిల కిలలతో మురుస్తూ తానూ నవ్వేసేది)


2. మా మరొక మామ్మ గారి ఆ/పాట. పంక్తికొక వేలు ముడుస్తూ పాడేవారు.

తిందాం తిందాం అందంట (బొ.వే)
ఎట్లా తిందాం అందంట (చూ.వే)
అప్పుతెచ్చి తిందాం అందంట (మ.వే)
అప్పెలా తీరుద్దాం అందంట (ఉం.వే)
ఎగ్గొట్టిపారిపోదాం అందంట (చి.వే)
ఎలా పారిపోయారంటే ఇలా (కిత కితలు)

వెరసి కిలా కిలా నవ్వులు.


3. బాల పిల్లల బొమ్మల పత్రిక (1947 నవంబర్) సంచిక నుంచి సంగ్రహించినది. ఇందులో అనగా అనగా చెయ్యి అనే ఆమెకు ఐదుగురు కొడుకులు. వాళ్ళే ఐదు వేళ్ళు. బొటనవేలు పెద్దన్నయ్య అన్నమాట, చిటికెన వేలు బుల్లి తమ్ముడూను. వాళ్ళ పాట ఇది

తిందాం, తిందాం, తిందాం (చి.వే)
ఏమిటి తిందాం? ఏమిటి తిందాం? ఏమిటి తిందాం? (ఉం.వే)
అప్పచ్చులు తిందాం? అప్పచ్చులు తిందాం? అప్పచ్చులు తిందాం? (మా.వే)
అప్పచ్చు లెలావొస్తాయి? ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? (చూ.వే)
నేనే తెస్తాను! నేనే తెస్తాను! నేనే తెస్తాను! (బొ.వే)


4. అమృతవీణ బ్లాగు లో దొరికినది

ఇల్లలికి ముగ్గేసి
ఆకేసి పీటేసి
పప్పెట్టి బువ్వెట్టి
పాలోసి పెరుగోసి
అత్తారింటికి తోవేదంటే
కిత కిత కిత కిత కిల కిల కిల కిల


5. తెలుగుదనం.కో.ఇన్. వారి సైట్ లోనిదిది.

ఆకేసి ఉప్పేసి
పప్పేసి అన్నం పెట్టి
చారేసి నెయ్యివోసి

అమ్మకొక ముద్ద
చెల్లికొక ముద్ద
అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద
తాతకొక ముద్ద

అందరికి పెట్టి
నువ్వు తిని
నేనూ తిని

ఆకెత్తేసి ఆకేసి వక్కేసి
సంతకు పోయే దారేది
అత్తారింటికి దారేది??


ఇక, మీ మీ పాటలు రచించో, రాగాలు కట్టో పెట్టేయండిక.

6. రసజ్ఞ గారు ఇచ్చినది:
ఇల్లలికి ముగ్గేసి
ఆకేసి పీటేసి
పప్పేసి కూరేసి
ఆమేసి (ఆం అంటే అన్నం) నెయ్యేసి
ముద్ద చేసి తినిపించి
తినిపించి మూతి తుడిచి
అత్తారింటికి దారేదంటే....
గోళ్ళపాలెం నుంచి వేళ్ళపాలెం
వేళ్ళపాలెం నుంచి అరచేతి పాలెం
అరచేతి పాలెం నుంచి ముంజేతి పాలెం
ముంజేతిపాలెం నుంచి మోచేతి పాలెం
మోచేతి పాలెం నుంచి చంకల పాలెం

7. జయ గారు ఇచ్చినది:

ఇల్లు అలికి-ముగ్గువేసి
పీటా వేసి - ఆకు వేసి
పప్పు వేసి - పాయసం వేసి
అన్నం పెట్టి - అప్పచ్చీ పెట్టి
పాలు వేసి - పెరుగు వేసి
కూరా వేసి - చారు పోసి
నెయ్యి వేసి - ముద్దా చేసి
నోట్లో పెట్టి - తినిపించి
చేయి కడిగి - మూతి తుడచి
తాత గారింటికి - దారేదండి?
ఇట్లా పోయి - అట్లా పోయి
మోచేతి పాలెం - ముందుకు పోయి
ఇదుగో వచ్చాం - అదుగో వచ్చాం
చెయ్యి ఎత్తి - చంకలో పెట్టి
వేలు పెట్టి - చక్కిలి గిలిగిలి
చక్కిలి గిలిగిలి - చక్కిలి గిలిగిలి....

అని పాట ఒక్కొక్క లైనుకి ఒక్కో వేలు మూసి తీస్తూ, అరచేయినుంచి మోచేతిమీదుగా చంకలో దాకా వెళ్ళి చేతి వేళ్ళతో చక్కిలిగిలి పెట్టాలి. పిల్లలు విషయం తెలుసుకోటమే గాక అనుభవిస్తారు కూడాను :)

సహాయం: వేసిందే ఒక గంతు విరిగిందే ఒక కాలు?

బాల సాహిత్య మిత్రులకి, ఒక అభ్యర్థన. నేను నా బడి పిల్లలకి జాతీయములు + తెలుగు కథలు (ముఖ్యంగా పంచతంత్రం, చందమామ కథలు, నేను కూర్చే కథలు) కలిపి నేర్పే ప్రక్రియలో ఉన్నాను. ప్రధానంగా నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని కాదు, ప్రవృత్తి రీత్యా పిల్లలకి మంచి నేస్తాన్ని అయినదాన్నే మాత్రమే! వారిలో కుతూహలం, ఆసక్తి కలగాలి, నేర్చినవి గుర్తుండాలి - అది నా గురి.


తొలి ప్రయత్నం - "వేసిందే ఒక గంతు, విరిగిందే ఒక కాలు" అన్న జాతీయం. వికిపీడియా నుంచి "అనుభవ రాహిత్యం. శాస్త్ర బద్ధంగా కాక ఏదో వచ్చీరానట్టు చేయటం.అరకొరగా పని చేశానని అనిపించటం, " వివరణ కాక నాకు ఈనాడు వారి సోదాహరణలు దొరికాయి. ఇక తగిన పంచతంత్రం కథ వెదకాలి. ఎవరికైనా తెలిస్తే చెప్తే నా కష్టాన్ని పంచుకున్న పుణ్యం దక్కుతుంది మీకు.


ఇవికాక, మీకు తోచిన స్వంత కథ/విశేషం పంచుకుంటే సంతోషం. నేను కట్టే కథ మీతో త్వరలో పంచుకుంటాను.

ముగ్గురు స్నేహితుల కథ!

ఒక ఊరిలో ఓ మిరప కాయ, ఓ ఉల్లిపాయ, ఓ మంచుముక్క ముగ్గురూ మంచి స్నేహితులట. కావాలంటే 'అనగనగా' అని కలిపి చదువుకోండి.

ఒకనాడు ఆ ముగ్గురు ఈతకి వెళ్ళగా, నీళ్ళలో మునిగి మంచుముక్క కరిగిపోయిందట. ఆ ఘటన కి విలపిస్తూ వస్తున్న మిగిలిన ఇద్దరినీ ఒక బజ్జీ బండి బూచాడు వెంటాడి, ఆ మిరప కాయని పిండి లో ముంచి, నూనెలో వేపి హత్య చేశాడట.

విల విల్లాడి, వల వలా ఏడుస్తూ ఉల్లిపాయ దేముని సన్నిధిని చేరి "నా మిత్రులిరువురి కొరకూ నేను విలపించాను. నా కోసమెవరు ఏడుస్తారు,స్వామీ?" అని అడుగగా ఆ స్వామి "ఉల్లీ, ఇక నుంచీ నిన్ను నీ సంతతిని చంపినవారే ఏడ్చేదరు," అని వరమిచ్చాడట.

విజ్ఞానం: ఉల్లిపాయ కోస్తే కళ్ళనీళ్ళు ఎందుకు వస్తాయి?

నీతి: అన్ని కథలు నీతికథలు కావు. అన్ని కథల్లో కథ ఉండనట్టే, సత్యమూ ఉండదు. కానీ సరదా ఉంటుంది. బాల్యావస్థ లో మెసిలే ప్రతివారికీ అది కావాలి.

నచ్చినవారు ఒక స్మైలీ, నచ్చనివారు తమ స్వంత కథ వ్రాసి వెళ్ళమని రచయిత మనవి. :)

***

ఈ కథ కి మూలం మా టీచర్లే - కామేశ్వరి, సావిత్రి గార్లు. ఒక విషయానికి ముందిలా తేలికపాటి పిల్లల్లో ఆసక్తి రేపే అంశం ఎత్తుగడగా మొదలెట్టి క్రమంగా అసలు పాఠ్యాంశం బోధించేవారు. నేనీ కథ చెప్పి పిల్లలు నవ్వి, కాస్త కులాసాగా ఉన్నాక, అసలు తెలుగు లో చర్చ మొదలు పెట్టాననుకోండి. ఒకటొకటిగా అంశాల్లోకి వెళ్తాము. (జీవించటం) స్నేహితులు ఎలా ఉండాలి? అసలు మన ప్రయత్నమెంత ఉండాలి? దైవాన్ని ఎందుకు గురిగా పెట్టుకోవాలి? (సైన్స్) మంచు ఎందుకు నీళ్ళలో కరుగుతుంది? ఉల్లిపాయలో ఏ రసాయనం అలా కంటికి నీళ్ళని రప్పిస్తుంది? (వంట) పచ్చిమిరప బజ్జీ ఎలా చేస్తారు?ఇవి వాళ్ళకి కొత్త గా తెలుగుబడి నేర్పేవి కాకపోయినా తెలుగు మాట, సేత వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నేర్చుకోవటానికి బెట్టుచూపకుండానే నేర్చేసుకుంటారు.

కథ: తులసికోట

గోదావరి జిల్లాల్లో ఓ పల్లెటూరు. ఇప్పటికి ముప్పై ఐదేళ్ళ పైనాటి మాట. ఉమ్మడి కుటుంబాలు అపుడపుడే విడిపడుతున్న రోజులు.

సాయంసంధ్య వేళ. చల్లబడ్డ సూర్యకిరణాలు కాస్త ఎరుపుకి తిరిగాయి. పశువుల కాపర్లు గొడ్లని కాలవల్లో కడిగి ఇళ్ళకి మళ్ళిస్తున్నారు. వీధుల్లో కాస్త ఆ సందడి. కొందరు ముందు గుమ్మాలు చిమ్మి సాయంత్రపు ముగ్గు వేస్తున్నారు.

పాలు, పెరుగు, పాత ఆవకాయ పచ్చడి కొనుక్కోను ఇళ్ళ చుట్టూ తిరిగే రోజు కూలీలు, మనవల్ని చంకనేసుకుని పాలబువ్వో, పెరుగన్నమో, చారన్నమో తినిపించేవారు మరి కొందరు. గుమ్మాల్లో అరుగుల మీద దూకుళ్ళాటలు ఆడుతున్న పిల్లలు. కావిళ్ళతో మంచినీరు తెస్తున్నవారు, అలా రకరకాల జన సందోహం.


ఆ వీధి అంతా మండువా ఇళ్ళే. ఒకదాన్ని ఆనుకుని మరొకటి. పెద్ద పెద్ద ఎత్తరుగులు. అటువంటిదే ఆ ఇల్లు. గుమ్మానికి అటూ ఇటూ రెండు వాటాలుగా మేనత్త, మేనమావ సంతానం కి చెందిన చావిడి అది. సూరయ్య గారు వీధరుగు మీద కూర్చుని రామనామ స్మరణలో వున్నారు. ముడతలు పడ్డ మొహం, ఎనభైకి సుమారు వయసు, వయసుని తెలుపుతున్న బలహీనపడ్డ దేహం.

ఎప్పటిమాదిరే వంట పాకలో ఆయన కోడలు కమల అన్నం వార్చుతూ, చుట్టాలు వస్తున్నారని పాలేరు మీద మధ్య మధ్యలో కేకలేస్తూ హడావుడి పడుతూ వుంది. పెరటివైపు ఇంటికి, వంట పాకకీ మధ్యన తులసికోట.

వంట పాక గోడకి మట్టితో అలికి కట్టిన చిన్న అరుగు మీద ప్రత్తి వత్తులకి విడతీస్తూ కూర్చునున్నారు సీతమ్మ గారు. ఆవిడ కట్టుకున్న తెల్లచీరతో పోటీ పడ్డట్టు నెరిసిన జుట్టు. కళ్ళజోడు ఆమె యాభై దాటిన వయసుని తెలుపున్నట్లుగా వుంది. పరీక్షగా వింటే ఆవిడా యేదో స్మరణ చేసున్నట్లు తెలుస్తుంది.

"కమల, ఎందుకే అంత హడావుడి పిచ్చితల్లి. వచ్చేది మాధవ ఒక్కడేగా?" అన్నారు సీతమ్మ గారు చిన్నగా నవ్వుతూ.

మాధవ సీతమ్మ గారి కొడుకు. ఒక నెలగా అన్నగారింట వున్న తల్లిని తీసుకువెళ్ళటానికి ఆ రోజుకి వస్తున్నానని ఉత్తరం రాసాడు. పైగా ఆ మర్నాడు తండ్రి తద్దినం. కాలవ స్నానాలు వుంటాయి. ఊర్లోకి పెద్దగా ప్రయాణసదుపాయం లేదు. మూడు మైళ్ళ అవతల వంతెన మీద బస్సు దిగి, వూర్లోకి రిక్షాలు, బళ్ళు కట్టించుకుని రావాల్సిందే.

"మీరలాగే అంటారు పిన్ని. మా మర్యాదలు మానతామా." గోంగూర పచ్చడికని వేపిన పోపు రోటి దగ్గరకి తెస్తూ అంది కమల.

"నేను పచ్చడి నూరతాను. నువ్వు మిగిలిన పని చూస్కో." అంటూ లేచారావిడ.

"రంగా, కాస్త ఆ మంట ఎగదోసి నీళ్ళు కాగాయేమో చూడరా. పెద్దయ్యగారికి తోడేస్తే మళ్ళీ కాగుంటాయి చుట్టాలొచ్చేసరికి ..." కమల ఈ మాట అంటూ వంట పాకలోకి వెళ్ళింది.

సీతమ్మ గారు కూర్చున్న అరుగు వారగా కోళ్ళ గూడు. పాకకి, ఇంటికి నడుమ ఓ ప్రక్కగా బావి. బావి చాఫ్టాని ఆనుకుని నీళ్ళ తొట్టి. అందులో తేలుతున్న బీరకాయలు, అరటి కాయలు. కూరగాయలు పాడవకుండా అలా దాచేవారు.

పాక వెనగ్గా, మిగిలిన స్థలం అంతా మరీ వరసలు పెట్టి కాదు కానీ, ఓ మల్లె కుదురు, కరివేరు చెట్టు, నిత్యమల్లి మొక్క, నందివర్థనం, మందారం, కర్వేపాకు, నిమ్మ చెట్టు, మునగ చెట్టు, జామ చెట్టు, కనకాంబరాలు.

బావి వెనగ్గా చిన్న కూరమడి. బెండ, మెట్ట వంకాయ మొక్కలు, గోంగూర, తోటకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి మళ్ళు. వంట పాక వెనక నించి పాకిన ఆనప, బీర, దోస పాదులు. పందిరికి పాకించిన దొండ, చిక్కుడు. ఏపుగా ఎదిగిన మొక్కలు, చెట్ల తో పచ్చగా కళకళలాడుతున్న పెరడు. కోటలో గుబురుగా సిరివుట్టిపడుతూ తులసమ్మ.


పచ్చడి నూరుతూ సీతమ్మ స్వగతంగా అనుకుంది ఆయన ఈ లోకం విడిచి అప్పుడే ఇరవై యేళ్ళు గడిచిపోయాయి. తులసమ్మ ఆ ఒక్కరోజే కదా తలవాల్చింది. చేతులో పని సాగుతూనేవుంది మనసు ఆనాటి ఆలోచనల్లోకి సాగిపోతుంది.

*************************************************

సీతమ్మ సూరయ్య గారి మారుటి చెల్లెలు. వారిది తొమ్మిదిమంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ కుటుంబం. తండ్రి అచ్చియ్య గారు. నరసమ్మ గారు, సూరయ్య గారు ఇలా ఏడుగురు తర్వాత వారి తల్లి మరణించాక, రెండో వివాహం ద్వారా మరొక మగ సంతు, సీతమ్మ కలిగారు.

సీతమ్మని ప్రసవిస్తూ ఆవిడా ప్రాణం విడిచింది. అప్పటికే కాపురానికి వచ్చిన పెద్ద కోడలు, సూరయ్య గారి భార్య లక్ష్మీదేవి ఇక ఆ ఇంటికి ఆడ దిక్కు. అచ్చియ్య గారి తల్లి జానకమ్మ పెద్ద దిక్కు. సీత ని ఆవిడే పెంచారు. అచ్చియ్య గారు "బుల్లి" అని ప్రేమగా పిలుచుకునేవారు. అదే పిలుపు యేడుగురు అన్నలు, వదినలదీను.


స్వతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులు. ఖాదీ ఉద్యమం పల్లె పల్లెల్నీ వూపేసిన తరుణం. సీత కి అలా ఖాదీ వస్త్రాలు అలవాటు . తన పదకుండో యేట మేనమావ కొడుకు సూర్యం తో సీత పెళ్ళి జరగ్గానే తండ్రి మంచం పట్టేసాడు. సూరయ్య గారి చేతిలోకి ఇంటి బాధ్యతలు మారాయి.

పదిహేనేళ్ళ సూర్యం ఇంటిపట్టున వుండటం తక్కువ. కళాభిమానం ఎక్కువ. మంచి స్ఫురద్రూపి. ఆరడుల ఎత్తు, ఎత్తుకి తగ్గ మనిషి. ఎర్రటి మనిషి, నల్లటి వుంగరాల జుట్టు. నాటకాల్లో పద్యాలు లీనమైపోయి పాడుతుంటే జనాలు అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవారని సీతకి అన్నలు చెప్తూవుండేవారు. తనంత తను చూసిందెన్నడూ లేదు.


సీతకి పదహారో యేడు నడుస్తుండగా మాధవ కడుపున పడ్డాడు. తను పుట్టింటికి రావటం, స్నేహితునితో కలిసి సినిమాలు తీయటానికి సూర్యం మద్రాసుకి పయనమవటం ఒకసారే జరిగాయి. అంతదూరం సీతని ఒక్కదాన్ని పంపటానికి పెద్దలు ఇష్టపడలేదు.

అప్పటినుండి కుటుంబ బాధ్యత ఒకటొకటిగా వదిలేసాడు. కొంత బావగార్లు, మరికొంత అన్నగార్లు చొరవ చేసుకుని మందలించినా అతనిలో మార్పు రాలేదు. మరో ఐదేళ్ళకి లక్ష్మి పుట్టింది. సూర్యం రాకపోకలు ఎడం పెరుగుతూ వస్తుంది. కాస్త కాస్త పొలం అమ్మటం వరకు అతని ఖర్చులు పెరిగాయి.


మద్రాసులో ధాన్యం వ్యాపారం చేసే తమ వూరి మనిషి ద్వారా సూర్యం తనతో నటిస్తున్న కోమలవల్లిని వివాహం చేసుకున్నాడని విన్నది. అన్నగార్లతో కూడ ఆ మాట ఎత్తలేదు, మౌనంగా పూజలో నిమగ్నమై మనసుని వూరడించుకోవటం తప్ప. వదినలంతా మంచివాళ్ళే కానీ ఇద్దరికి మాత్రం కాస్త నోరు దురుసు. సూర్యం సంగతి తెలిసాక మాటజారారు. లోకువ కట్టారు. అయినా సీత నొచ్చుకోలేదు. భర్త నోట నిజం తెలుసుకోవాలనే ఆగింది.

సూర్యం ఆ మారు వచ్చినపుడు తటపటాయిస్తూ "నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు.." అంటూ ఆగిపోయింది.

"సీత ఇలా దగ్గరగా రా." సూర్యం గొంతులో తొణికిసలాడుతున్న ప్రేమ.

కళ్ళనీళ్ళు నిండిపోయాయి. ఆమెని పొదివి పట్టుకుని "నేను చెప్పేది నెమ్మదిగా విను. ఆ తర్వాత నీ ఇష్టం." అన్నాడు.

"నీకు తెలియందేముంది. నాకు నీవంటే ప్రేమ కి లోటు లేదు. నాటకాల పట్ల అభిమానం, అదే ఇప్పుడు సినిమాల పైకి మళ్ళింది. అది నా బలహీనత కూడ. కోమలి నాకు చిన్నప్పటినుండీ పరిచయం. మా ఇష్టం ప్రేమ అని తెలుసుకునే నాటికి మన వివాహం అయిపోయింది. తను నన్ను నమ్ముకుని మద్రాసుకి వచ్చేసింది. ఎవరి అండదండలూ లేవు. నీకు అంతా వున్నారిక్కడ. నాకు నువ్వు కావాలి. కానీ నా పట్ల పిచ్చిప్రేమ పెంచుకుని వచ్చేసిన ఆ అమాయకురాలినీ వదుకోలేకపోయాను. తనని వివాహమాడాను. నీ దగ్గర దాయాలనుకోలేదు. ముందుగా చెప్తే కోమలిని యేమైనా చేస్తారని భయపడ్డాను. నన్ను క్షమించు సీత. నేను చిక్కుముడిలో వున్నాను. నిన్ను, పిల్లల్ని వదలను. నేను నీ ఒక్కదానికే జవాబుదారీని. ఈ ముడి విప్పే భారం నీదే." అతని మాటల్లో నిజాయితీ.

అలాగే లేచి వెళ్ళి, కాళ్ళు చేతులు కడుక్కుని పూజ గదిలో కూర్చుండిపోయింది. "అమ్మా పార్వతి, నాకేమిటి కర్తవ్యం? నాకెందుకీ పరీక్ష?" సీత కళ్ళలో దైన్యమే కానీ కోపం లేదు. కుటుంబమే లోకం గా పెరిగిన మనిషి. అంత నిస్సహాయస్థితిలోనూ కోమలి ని గూర్చి "ఎవరి అండదండలూ లేవు" అని అతనన్న మాట మరవలేదు.

అలా దాదాపుగా ఓ వారం పది రోజులు అన్నపానాలు మాని విలపించింది. శోకం అణిగింది. ఆలోచన మొదలైంది.

"తనకి ఇద్దరి పిల్లల బాధ్యత వుంది. ఇపుడు అతన్ని బలవంతాన ఇక్కడ ఆపగల శక్తి తనకి లేదు. అలా చేసి అవతల మనిషిని అనాథని చేసి తను బావుకునేదీ లేదు. ఇల్లు వదిలి ఎక్కడికో పోయి బ్రతికే స్వశక్తి తనకి లేదు. ఇది దైవసంకల్పం. తనకొక పరిష్కారం కాలమే చూపాలి. తమ ముగ్గురి జీవితాలు ఈ బంధనంలో చిక్కడిపోయాయి. తను భర్తని ద్వేషించలేదు. అతనికి తన పట్లగల అనురాగంలో యే లోపం లేదు. బాధ్యతని విస్మరించి అలా అభిరుచి లోకాన పడి నడవటం మాత్రం తనని, పిల్లల్ని ఇబ్బంది పాలుచేస్తుంది. ఆ సమస్యకి కోమలి బాధ్యురాలు కాదు. ఇటు తన కుటుంబాన్ని నడపని వ్యక్తి మళ్ళీ ఆమె భారం తను తీసుకోవటం యెంత సబబు. ఈ పరిణామానికి కారణం ప్రేమా? తను దగ్గరగా లేక ఆమె చేరిక వలన జరిగినదా? అసలిక ఈ ఆలోచనల అవసరముందా?" స్వగతంగా ఎన్నిసార్లు ఈ మాటలే తిరగ తిప్పి అనుకుందో అన్నిసార్లు బరువెక్కిన ఆమె హృదయానికే తెలుసు.

సూర్యం ఆ సారి ఓ నెల వరకు వుండిపోయాడు. ఇద్దరి నడుమా ఇక ఆ ప్రసక్తి రాలేదు. కానీ ఆమె అన్నగార్లకి, అతని అన్నగార్లకీ విషయం తెలిసి అతన్ని వెలివేసినంత పని చేసారు. సీత అంత ఉత్తమ ఇల్లాలికి ఈ మనస్తాపం కలిగించిటానికి నీకు మనసెలా వొప్పిందని నిందించారు. సూర్యం మౌనంగా వుండిపోయాడే కానీ ఒక్కమాట తిరిగి అనలేదు.

అతను ప్రయాణమయ్యే నాటికి పంట చేతికొచ్చింది. పెద్దవాళ్ళెవరూ ఒక్క రూక అతనికి అందనీయలేదు. ఆ రోజే అతను వెళ్ళేది. గదిలో దండానికి తగిలించిన లాల్చీ తొడుక్కుని, వెనుదిరిగే సరికి సీత గది తలుపు మూసి దగ్గరకి వచ్చింది.

ముందుకు చాపిన గుప్పిట విప్పి అతని చేతిలో పెడ్తూ "కోమలికి నా కానుగ్గా ఇదివ్వండి." అంది. అవి ఆమె నల్లపూసలు. గొంతులో అదే సౌమ్యత.

"సీత, నీకున్న బంగారం అంతంత మాత్రం. నా సంపాదన ఎటూ లేదు. ఇది ఇలా ఇచ్చేయటం.." అతని మాట పూర్తయేలోగానే సీత వారిస్తూ, "అలా కాదు. నా మనసుకి తోచినదిదే. మీ జీవితాన్ని మా ఇద్దరికీ పంచారు. నాకు కలిగినది తనకి ఇవ్వటం లో తప్పులేదు," తిరిగి తనే పొడిగిస్తూ

"ఇది తప్పో వొప్పో నాకు తెలియదు. నాకు తెలిసిన లోకం చిన్నది. నా వంటి మనిషే తను అన్న భావన అంతే." అంది.

అతని మనసులో ఎక్కడో అప్పుడు కదలాడింది అపరాధబావన. "నన్ను క్షమించు సీత. నేను స్వార్థపరుడిని. తలవంపు పని చేసాను. రేపు కన్నపిల్లలు కూడా అసహ్యించుకుంటారేమో" అన్నాడు.

"అంత దూరం ఆలోచించకండి. ఆ సమయానికి అయ్యేదేదో అవుతుంది." అని "ఇదిగో ఈ నగ అవసరపడవచ్చు. మీకు డబ్బుకి ఇబ్బంది అని తెలుసు." అన్నాక గానీ గమనించలేదు ఆమె మెడలో పసుపుతాడు వుందని. సూత్రాల గొలుసు కూడా అతనికే ఇచ్చేసింది.

"నీకు ఋణపడిపోయాను సీత. ఈ కుటుంబాన్ని పోషించగలనాడే తిరిగి నీ దగ్గరకి తలయెత్తుకుని వస్తాను. అందాక మీ వారి, మా వారి అండదండలు నీకు రక్ష." అంటూ గుమ్మం వదిలాడు.

ఆమె మనసున తుఫాను వెలిసిన ప్రశాంతత. అతను తన దగ్గర యేదీ దాచలేదు. తనకి తోచిన విధంగా తను ముడివిప్పింది. అందరికీ ఆ పైవాడే అండదండ.

ఆ తర్వాత సూర్యం రాకపోకలు వేళ్ల లెక్కన అంతే. పిల్లలిద్దరినీ గుట్టుగా పెంచుకుంటూ, అన్నలు, బావగార్ల అండదండలతో సంసారం లాక్కొస్తుంది. పెద్ద వదిన నయం కాని జబ్బుతో కాలం చేయటం, అన్నయ్య ముగ్గురు పిల్లలకీ తనే పద్ద దిక్కైంది. నిజానికి పెద్ద మేనల్లుడిది దాదాపుగా తన వయసే. ఆ బిడ్డల పోషణలో భర్త ధ్యాస పూర్తిగా మర్చిపోయింది.

మాధవ తెలివైన కుర్రాడు. చదువులో చురుకు ఎక్కువ. ఎండనక, వాననక మూడు మైళ్ళు పడి వెళ్ళి ప్రక్క వూరి బడిలో చదువుకుంటున్నాడు. తండ్రి అంటే గౌరవాభిమానాలు. తల్లి అంటే అమిత ప్రేమ. చెల్లిని "పాప" అంటూ అనురక్తితో చూసుకునేవాడు. చూస్తుండగానే మరో పదేళ్ళు గడిచిపోయాయి. మాధవ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

మాధవ కి ఇరవైవ యేడు నడుస్తుండగా తండ్రి కబురందుకుని వెళ్ళి కలిసి వచ్చాడు. ఆ రాత్రి అన్యమనస్కంగా వున్న కొడుకుని "అబ్బాయ్ మాధవ, ఏమిట్రా అలా వున్నావు?" అని అడిగింది. ఏమీ లేదని మాట తప్పించబోయినా తల్లి వూరుకోలేదు.

"ఇక ఆయన మన మనిషి కాదమ్మా. ఆయనకి మరొక కొడుకు కూడా వున్నాడు. అతన్ని ఆయనే చదివిస్తున్నారు," మాధవ గొంతులో కనీ కనిపించని కోపం. "వచ్చేనెల్లో వస్తారట, నిలదీసి అడుగు." అన్నాడు.

సీత ముందు నివ్వెరపోయింది. తనకి తెలియదు ఈ విషయం. తర్వాత కొడుకు ప్రక్కనే కూర్చుని వెన్ను నిమురుతూ "నువ్వు చాలు నాయన నాకు. ఇక ఈ కుటుంబ భారం నీదే. తండ్రిని తప్పుబట్టబోకు. ఇవన్నీ మన చేతిలోవి కావు. కర్మఫలాలు. ఇన్నాళ్ళు మావయ్యలు మననెంతో ఆదుకున్నారు. ఇకపై నీవు నన్నూ, చెల్లినీ చూసుకోవాలి." అంది. అలా కాసేపు తల్లీబిడ్డా మౌనంలో మునిగి వుండిపోయారు.

మరొక మూడు వారాలకి సూరయ్య గారి పెద్ద కోడలు కమల బలవంతం మీద మూటలతో ఇంటికి వచ్చి చీరలవీ అమ్మే మాణిక్యాలరావు దగ్గర ఐదు రంగు బట్టలు కొని, ఆది జాకెట్టుగా తన ఖాదీ రవిక ఇస్తూ పసుపు బొట్టు అద్ది ఇచ్చింది. పుట్టాక సీత మనసున వున్న ఒకేఒక్క గాఢమైన కోరిక అది. రంగు జాకెట్టు తొడుక్కోవాలని.

ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసుకుని చివరగా తులసమ్మకి పూజకని పెరట్లోకి వచ్చేసరికి కాస్త తలవాల్చినట్లున్న కొమ్మలు చూసి మనసు కీడు శంకించింది. నీరు పోసి, కోటలో భూసింధూరం నుదుటికి అద్దుకుని అక్కడే కూర్చుండిపోయింది.

ఆ రోజే సూర్యం చనిపోవటం, వూరిలోకి శవాన్ని తేవటం అనువు కాదని దహన సంస్కారాలు మాధవతో అక్కడే పూర్తి చేయించారు. అప్పటికి సీత సూర్యాన్ని చూసి ఐదు సంవత్సరాలు.

అలా సీత రంగుల కల తెల్ల చీరగా ముగిసిపోయింది. ఇరవై ఐదేళ్ళ ఆమె వైవాహిక జీవితం గతానికి చేరిపోయింది. కన్నిటి వరదలో కుంకుమ తుడుచుపోయింది. పదకుండో రోజుకి వచ్చిన కోమలి సూర్యం ఫోటో ఒకటి ఇచ్చి వెళ్ళింది. అందులో సూర్యంకి ఆమె వలన కలిగిన బిడ్డ కూడా వున్నాడు. ఆ పఠాన్ని భద్రంగా దాచుకుంది. మనసులోని అతని రూపు తనేనాడూ మరవలేదు.

తమ్ముడు పోయాక అతని అన్నల్లో కాస్త మార్పు. పొలాల దగ్గర కాస్త స్వార్థాలు చూపారు. వచ్చినంత వాటాతో పెద్ద అన్నయ్యతోనే వుండిపోయింది.

మాధవ ఉద్యోగంలోకి చేరటం, అతని పెళ్ళి అవటం. ఇల్లు, పొలాలు అమ్మేసి చెల్లి కట్నంగా ఇచ్చి మంచి వరునికి ఇచ్చి పెళ్ళి చేసి తల్లిని తన వెంట తీసుకుపోవటం ఆ తర్వాత ఐదేళ్ళలో జరిగిపోయింది.

అంతవరకు వూరి పొలిమేర దాటని చెల్లిని హత్తుకుని సూరయ్య గారు విలపిస్తూనే పంపారు. అప్పటి నుండీ అపుడపుడూ అన్నల దగ్గరకి రావటం జరుగుతూనే వుంది.

*************************************************

వంతెన మీద ఆగిన బస్సు దిగిన మాధవ చెయ్యి పట్టుకుని ఆరేళ్ల భవాని చుట్టూ వింతగా చూస్తూ నడుస్తుంది. పైకి మడిచి రిబ్బన్లు కట్టిన రెండు జడలు. అంబ్రిల్లా మోడల్ గౌన్లో కూడా సన్నగా కనపడుతున్న పిల్ల.

ఒక ఐదు నిమిషాలు చూస్తే తెలిసిపోతుంది, గుక్కతిప్పుకోకుండా ప్రశలేస్తుందని. వంతెన కి కాస్త దిగువగా ఒక సోడాలు, కాస్త చిరుతిళ్ళు అమ్మే బడ్డీ కొట్టు, చిన్న టీ హోటల్, ప్రక్కగా సైకిల్ అద్దెకిచ్చే కొట్టు. అక్కడే ఓ నాలుగైదు గూడు రిక్షాలు, ఒక గుర్రపు బండి వున్నాయి.


"భవానీలు, రిక్షా ఎక్కుతావా? గుర్రం బండి ఎక్కుతావా?" మాధవ మాట పూర్తవకమునుపే "నాన్న గారు, నేను సైకిల్ తొక్కొచ్చా?" అ పిల్ల అడిగిన తీరుకి ముచ్చట వేసింది.

"అది పెద్ద వాళ్ళకమ్మా, నీకు కాళ్ళు అందవు. పోనీ నేను తొక్కనా?" అని అడిగాడు.

"భలే భలే, నేను ముందు ఎక్కుతాను." కేరింతలు కొడుతూ అంది.

సైకిల్ అద్దెకి తీసుకుని, తెలిసిన రిక్షా అతను జోగులుకి తన చేతిలోని బాగ్, పళ్ళ బుట్ట, మర్నాడు తన తండి సంవత్సరీకానికి కావల్సిన సామానులున్న అట్ట పెట్టె, సూరయ్య గారి ఇంటిలో చేర్చమని పురమాయించి, భవానీని ఎత్తుకుని ముందు కడ్డీ మీద కూర్చోబెట్టి నెమ్మదిగా తొక్కటం మొదలు పెట్టాడు. జోగులు వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు, అలవాటైన బాటే కనుక పైగా సవారీ ఎవరూ లేరు.

పొలాల మధ్య వెళ్తున్న కంకర రోడ్డది. కాస్త ఎతుకులు గతుకులు గా వుంది. భవాని కుతూహలంగా పరిసరాలు గమనిస్తూ యేదో ఒకటీ అడుగుతూనే వుంది. మధ్య మధ్యలో సైకిల్ బెల్ "ట్రింగ్ ట్రింగ్.." అని తన నోటితో జతకలిపి మరీ మోగిస్తూ సందడి చేస్తుంది.

కాస్త దూరం వెళ్ళాక, ఒక కాలువ మీదుగా వెళ్తున్న వంతెన మీద ఆపాడు. పిల్లని దించి సైకిల్ కి స్టాండ్ వేసి "అమ్మలు, నీకొక మాట చెప్తాను, గుర్తు పెట్టుకుంటావా?" అని అడిగాడు.

"ఓ ..." కళ్ళు రెండూ గుండ్రం గా తిప్పుతూ, నోరు కూడా సున్నాలా తిప్పి మరీ చెప్పింది.

"ఇదిగో చూసావా, ఈ కాలువ మీద ఓ తెల్ల దొర గూటి పడవలో అలా వెళ్తూ వుండేవాడు. నేను అప్పుడు నీ అంత వుండేవాడివి. అతనిలా దర్జాగా వుండాలనే చదువుకుని ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు కూడా చదువుకుంటావా?" అని అడిగాడు.

"ఊహు నేను సీతమ్మామ్మలా పూజలు చేస్తాను. మామ్మకి పార్వతీదేవి కనిపించింది. నేను సరస్వతిని చూస్తాను." అమాయకంగా సమాధానమిచ్చిన కూతుర్ని చూస్తే మాధవకి తను వేసిన ప్రశ్నకి జవాబిచ్చేంత వయసు ఆ పిల్లకి లేదనిపించింది.

"నాన్నగారు, మరి అమ్మమ్మ వూర్లో రైలు బండి ఎక్కిన తెల్లదొర బిళ్ళలిచ్చాడట. అమ్మ చెప్పింది. నీకు ఆ పడవ ఎక్కినవాడు ఇచ్చాడా బిళ్ళలు, బిస్కట్స్?" అని అడిగింది.

"ఇచ్చాడమ్మా అంతకన్నా ఎక్కువే తాయిలం ఇచ్చాడు. అతనిచ్చిన స్ఫూర్తే ఇదిగో ఇలా నన్ను నిలబెట్టింది." యేదో లోకంలో వున్నట్లుగా అన్నాడు.

"నాన్నగారు, నాకు ఆకలి వేస్తుంది. నాకు పాలు కావాలి." కాస్త బిక్క మొహం పెట్టి అడిగింది. అప్పటికి గానీ ప్రయాణం హడావుడిలో పిల్లదానికి సాయంత్రం పాలకి ఎక్కడా ఆగలేదని గుర్తుకువచ్చింది.

"ఇదిగో ఇంకెంత ఇట్టే వెళ్ళిపోతాము." అంటూ పిల్లని ఎక్కించి హడావుడిగా తొక్కటం మొదలు పెట్టాడు.

ఊరి మొదల్లోకి వచ్చేసరికి పూజారి గారు యెదురయ్యారు.

దిగి నమస్కారం చేసి "బాగున్నారా హనుమాళీ గారు?" అని నమ్రతగా అడిగాడు.

ఎదురెండకి కాస్త మొహం చిట్లించి చూస్తూ "నువ్వటయ్యా మాధవ, ఇదేనా రావటం, మీ మావయ్య అన్నారులే ఇవాళ సందె వేళకి వస్తావని. మళ్ళీ పొద్దున్నే గోదావరికి ప్రయాణం కదా?" అంటూ "ఓరోరి ఈ అమ్మడెవరోయ్, నీ కూతురా?" అన్నారు.

"అవునండి, అమ్మకి బాగా అలవాటు. మూడురోజుల్లో తీసుకొస్తానన్నా వినకుండా, మామ్మని చూస్తానని పేచీ పెట్టి వచ్చింది. ఎప్పుడూ తీసుకురాలేదని వెంటబెట్టుకొచ్చాను." అన్నాడు మాధవ.

ఇద్దరు మళ్ళీ ఓ రెండు నిమిషాల పాటు కబుర్లలో పడ్డారు.

భవాని ఆకలి మాట మరిచిపోయి పూజారి గారి వాలకాన్ని కాస్త వింతగా చూస్తుంది. ఎర్ర పట్టు పంచె, చంకలో యేదో మూట, పిలక, జందెం ఇవి కాక ఆయన మాటలు కాస్త సాగదీస్తూండటంతో సగం సగమే అర్థమౌతున్నాయి.

"భవాని, ఈ తాతగారు నిన్ను మామ్మ దగ్గరకి తీసుకు వెళ్తారు. సరేనా?" అంటూ "నేనలా ఓ సారి చెల్లి పొలం చూసి వస్తానండి. దీన్నీ మావయ్య గారి ఇంటి దగ్గర దింపేస్తారా?" అన్నాడు.

"అలాగే నాయన, దానికేం భాగ్యం. పదవే అమ్మడు.." అని ముందుకు కదిలారు.

ఒక నిమిషం వూరుకుంది గానీ, నెమ్మదిగా ప్రశ్నల్లోకి దిగింది.

"తాతగారు, మీకు ఆ పోనీటెయిల్ యెవరు కట్టారు?" అని అడిగింది.

ఆయనకి పెద్దగా అర్థం కాలేదా మాట.

"ఏం చదువుతున్నావు అమ్మడు?" అని అడిగారు.

"నేను సెంట్ జాన్స్ స్కూల్లో యూ కె జీ చదువుతున్నాను. మా టీచర్ రెజీనా." అని చెప్పింది. ఒకటడిగితే అలా పది చెప్పటం అలాగే అలవాటైంది భవానీకి.

అలా కాస్త నడవగానే, ఆయన ఎదురుగ వున్న సందు వైపు చెయ్యి చాపి "ఇదిగో అలా చూడు ఆ దక్షిన దిక్కు ఇల్లు వుందే, అదే మీ నానమ్మ ఇల్లు. వెళ్తావా అమ్మడు. కాళ్ళు పీకుతున్నాయి. పెద్దవాడిని కదా." అన్నారు.

ఆయన చెప్పిన దిక్కు అవీ తెలియలేదు కానీ, తల వూపి "టా.. టా.." అంటూ అటుగా అడుగులేసింది.

ఇంతలో యేమీ తప్పిపోదులే అనుకుంటూ ఆయన ప్రక్క సందు వైపు నడిచారు.

నాలుగడుగులు పడ్డాయో లేదో, వెనగ్గా పెద్ద గొడ్ల మంద వచ్చింది.

బెదిరిన భవాని పరిగెట్టి ఎదురుగా వున్న అరుగు ఎక్కి స్తంభం చాటున దాక్కుంది. అవన్నీ వెళ్ళాక నెమ్మిదిగా దిగి, కాస్త బిక్క మొహం వేసి చుట్టూ చూస్తే తాతగారు చెప్పిన ఇల్లు కనపడలేదు.

అడుగులో అడుగేస్తూ, సన్నగా వెక్కిళ్ళు పెడుతూ, మూడు గుమ్మాలు దాటి, నాలుగో వాకిలి అరుగు మీద వున్న పెద్ద పుస్తకం చదువుతున్న తాతగార్ని చూసి, దగ్గరగా వెళ్ళి, కాస్త పాదాలెత్తి, ఆయన్ని తన బుల్లి చేత్తో తట్టి "తాతగారు, మా సీతమ్మామ్మ వుందా?" అని అడిగింది.

ఓ నిమిషానికి అర్థం ఆ మాట ఆకళింపుకి వచ్చాక, ఆయన కళ్ళ వెంట జర జరా రెండు కన్నీరు జారాయి.

"ఇన్నాళ్ళకి నా బుల్లి ని వెదుక్కుంటూ ఓ చిన్ని తల్లి వచ్చిందా.." అంటూ "బుల్లీ అమ్మాయ్ బుల్లీ ఇలా రామ్మా, చూడు ఎవరొచ్చారో.." అంటూ గుమ్మం లోంచి లోపలికి చూస్తూ కేక పెట్టారు.

గోంగూర పచ్చడి నూరి తీసి కమల కిచ్చి చెయ్యి కడుక్కుని, సన్నజాజి మాల కడుతున్న సీతమ్మ గబగబా గుమ్మంలోకి వచ్చింది. మనవరాలిని చూడగానే కొండంత సంబరం.

"బంగారు తల్లీ యెలా వచ్చావురా? నాన్న యేడి?" అని ఒక్కడుగులో మూడు మెట్లూ దిగి మనవరాలిని అక్కున చేర్చుకుని ముద్దాడి, చంకనేసుకుంది.

"బుల్లే, నాకిక దిగుల్లేదమ్మా. నీ మనవలు వచ్చేసారు నిన్ను వెదుక్కుంటూ, నిన్ను వాళ్ళే చూసుకుంటారిక.." అప్యాయంగా అంటున్న సూరయ్య గారి మాటల్లో ఇంకా ఆ ఆనందం పోలేదు.

మనవరాలిని లోపలికి తీసుకెళ్ళి కాళ్ళు, చేతులు కడిగి, వేడి పాలు గ్లాసులో పోసి తెచ్చి వూదుతూ, వంటపాక ముందు వేసిన నవారు మంచం మీద కూర్చుని, వొళ్ళో కూర్చోబెట్టుకుని మనవరాలికి తాగిస్తూ ప్రయాణం సంగతి అడిగింది.

అసలు మనవరాలు వస్తుందని మాధవ జాబులో రాయలేదు. సీతమ్మకీ ఆ అనుకోని సంబరం అందులోనూ ఈ మనవరాలు అంటే ప్రాణం. పెద్ద మనవరాలు వాళ్ళ అమ్మమ్మకి చేరిక ఎక్కువ. ఈ పిల్లది పుట్టిన నాటి నుండీ తన ఒడి బిడ్డే.


సీతమ్మ గారికి చిన్నతనం నుండీ ఉపశమనం, మనశ్శాంతి పూజలే. భవాని పుట్టిననాడు పూజలో యేదో అనుభూతికి లోనయ్యారావిడ. అందుకే పట్టుబట్టి ఆ పేరు పెట్టారు. వెంట వెంట తిరిగేది. తల్లికన్నా తన దగ్గరే చేరిక ఎక్కువ.

పాలు గొంతులో నాలుగు గుటకలు పడగానే లేచి, వెనక వీపు మీదకి చేరి మెడ చుట్టూ చేతులు వేసి వెనక్కీ ముందుకీ వూగుతూ.."మామ్మ ఇది మన ఇల్లేనా?" అని అడిగింది.

"మనదేనమ్మా ఆ తాతగారిది. నీకు నాని అన్నయ్య ఎలాగో నాకు ఆ తాత గారు అన్నయ్య." అంది.

గబ గబా మంచం దిగి అలా మొక్కల్లోకి పరిగెత్తి ఓ నూరువరహాల గుత్తి తెంపుకుని తెచ్చింది. సీతమ్మగారిది బారెడు జుట్టు. ముడి పెడితే దోసిట పట్టేంత అయ్యేది. ముడివిప్పేసి, వచ్చిరాని జడ అల్లిక వేయటం మొదలెట్టింది భవాని. ఆ పిల్ల ఆ ఆట ఎప్పుడూ చేసేదే. అంతా అయ్యాక ఆ గుత్తి తలలో గుచ్చబోయింది.

"వద్దురా భవాని." మనవరాలిని వారిస్తూ అన్నారావిడ.

"ఎందుకు వద్దు మామ్మ?" అమాయకంగా అడిగిన అ పిల్లదాని కళ్ళలోకి చూస్తూ "తాత గారు లేరు కదా. అందుకు." అన్నారు.

"ఇక్కడా లేరా. మరి మనూర్లో అడిగితే వూరెల్లారన్నావుగా?" పిల్లదాని కళ్ళలో అపనమ్మకం.

"లేదు తల్లీ, దేముడు వూరికి వెళ్ళిపోయారు." ఆవిడ కళ్ళలో సన్నగా తడి.

సీతమ్మామ్మ ని అడిగే ప్రశ్నల్లో ఎక్కువగా "తాత గారు లేరు" అన్న సమాధానం వస్తుందని ఆ చిన్ని బుర్రకి అపుడపుడే తెలుస్తుంది.

'తను ఆటల్లో కుమారి జట్టు పచ్చీ కొడితే అమ్మాజీ తో ఆడుకుంటుంది కదా. మరి మామ్మ ఇంకో తాతగారిని తెచ్చుకోదా?' లీలగా వచ్చిన ఆ ఆలోచన పిల్ల దృష్టి పాక వెనగ్గా పరిగెడుతున్న ఎర్రావు లేగదూడ మీద పడటంతో అటుగా పరిగెట్టింది.

సన్నగా నిట్టూర్చి తనూ లేచి పిల్లని అనుసరించారు సీతమ్మ గారు. మునుపోసారి ఇలాగే దేముడి కుంకుమ పెడతానని పేచీ పెట్టి యేడ్చింది. ఇంకోసారి వాళ్ళ అమ్మ చీర తెచ్చి కట్టుకోమని మంకుపట్టు పట్టి కోడలు గదిలోంచి లాక్కేళ్ళే వరకూ హఠం వేసింది. ఇంకాస్త వూహ తెలిస్తేనే కానీ ఈ మారాములు మానదు అనుకున్నారావిడ.

ఓ గంటలోనే స్నానం చేయించి కాస్త పప్పుచారన్నం, పెరుగన్నం తినిపించగానే ఆ మంచం మీదనే ఆరుబయట మామ్మని వాటేసుకుని ఆవిడ పాడే పాట వింటూ పడుకుంది. భవాని అడిగడిగి పాడించుకునే ఆ పాట.


"అమ్మగారమ్మేది, ఆ పాల కొండేది, ఆ దొండ పండేది, అప్పుడు కాచిన నెయ్యేది. అమ్మా అమ్మా నిన్నేమన్నారే, కల కల వేగిన గారన్నారా? బుర బుర పొంగిన బూరన్నారా?" అని ఆవిడ అనగానే "నన్ను మా సీతమ్మామ్మకి దేవి ఇచ్చిన భవాని అన్నారు.." అనేది.

మాధవ రావటం, మిగిలిన మావయ్యలు, సంతానం కొందరు చేరటం అంతా కలిసి పిచ్చాపాటీ కబుర్లలో బాగా పొద్దు పొయ్యేవరకు మెలుకువగానే వున్నారు.


*************************************************

మాధవ తెల్లవారు ఝామునే బయలుదేరి వెళ్ళాడు. వెంట అతని పెద్దనాన్న కొడుకు చంద్రం, ఒక మేనమావ ధర్మరాజు వెళ్ళారు. హనుమాళీ గారు కూడ సందు మొగల్లో కలిసారు.

భవాని లేచే సరికి వేడి వేడి ఇడ్లీ వేసిక కమల తినిపించింది. "పద మరి ఇవాళ మీ తాతగారి తద్దినం. తలారా స్నానం చేసి నైవేద్యం పెట్టు." అంది.

అంతా అర్థం కాకపోయినా "తాత గారు" అన్నది గుర్తుపెట్టుకుని, మాట విని బుద్దిగా తయారైంది. కోరా రంగుకి మంకెన పువ్వు రంగు పరికిణీ, చేతులకి గాజులు, మెడలో పద్మం హారం, చెవులకి జూకా బుట్టలు. మనవరాలిని కళ్ళ నిండా చూసుకుని 'ఆయనకి అదృష్టం లేదు. కొడుకు ఎదిగొచ్చేనాటికి పిలుపు వచ్చేసింది. పెళ్ళి, మనవలు అన్నీ తనకి మాత్రం దక్కిన భాగ్యం' అనుకున్నారు.

అటుగా వచ్చిన కమల "నా దిష్టే తగిలేట్లుంది పిన్ని." అంటూ బుగ్గలు పుణికింది. పూల సజ్జతో మొక్కల్లో తిరిగి మందారాలు, నిత్యమల్లి, కరివేరు అవీ కోసుకొచ్చింది.

మామ్మ పక్కన కూర్చుని పూజ గమనిస్తూ ఆవిడ చెప్పినట్లు చేస్తూంది. భవానికి అన్నిటి లోకి తులసమ్మకి నీరు పోయటం, హారతి కి గంట కొట్టటం మహా ప్రీతి. అవి మాత్రం ఎవర్నీ చెయనివ్వదు.


భవానికీ ఐదో యేడు నడుస్తుండగా ప్రసాదం గా పెడుతున్న పటికబెల్లం పలుకులకి ముందే చెయ్యి చాపింది. "దేవికి నైవేద్యం పెట్టాక, మనం తీసుకోవాలమ్మా." అన్నారావిడ.

"మరి నేనే దేవీ ప్రసాదం అన్నావుగా. నేను భవానీని కాదా? నాకిస్తే దేవికి నేనిస్తా" అన్న ఆ చిన్నతల్లి మాటలకి, ఓ క్షణం నివ్వెరపడి 'అమ్మా పార్వతి, నన్ను మన్నించు ఇలా పసిదానితో పలికించావా.' అనుకుని ఆ నాటి నుండి పూలతో పూజే కానీ ఆవిడ ప్రసాదం మానేసారు.

మధ్యాహ్నం మూడు దాటే వేళకి గోదావరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు.

భవానీని చూస్తూ చంద్రం గారి అబ్బాయి అబ్బులు "మామ్మ భవానీకి నీ పోలిక వచ్చింది కదా?" అన్నాడు.

"కాదు మామ్మే నాలాగా వుంది." అని ఆరిందాలా చెప్తున్న భవాని మాటలకి అంతా నవ్వుకున్నారు.

మర్నాటికి తాతగారు చదివే పెద్ద పుస్తకాన్ని భగవధ్గీత అనీ, ఆయన వ్రాసేది రామకోటి అనీ కనుక్కుంది.

మూడోరోజు ప్రయాణమయ్యేనాటికి కమల వండిచ్చిన తొక్కుడు లడ్లు, చక్కిడాలు, కొబ్బరరిశెలు, మినపసున్ని ఇలా అన్నీ కలిపి మళ్ళీ ఐదారు శాల్తీలు అయ్యాయి. అబ్బులు యడ్ల బండి కట్టి వంతెన వరకు దింపాడు.

మాధవ ఆపిన వంతెన చేరగానే "మామ్మ, నాన్నగారికి ఇక్కడే తెల్లదొర తాయిలం ఇచ్చాడట. అందుకే పెద్దచదువులు చదివారట. నాకు నువ్వు తాయిలం ఇవ్వవా నేను సరస్వతి పూజ చేస్తాను." అంది భవాని.

"మాటల మూట ఇది, మామ్మ. వదలాలని లేదు." అంటూ "భవాని ఇక్కడ వుంటావా?" అని అడిగాడు అబ్బులు.

"ఊహూ, మా సీతమ్మామ్మ తాతగారి జట్టు పచ్చి చెప్పిందిగా. నేను కొత్త తాతగారిని తెస్తాను. నేను సరస్వతిని చూసి వస్తాను. అపుడు వస్తాను. నీకు ప్రసాదం ఇస్తాను అన్నయ్యా." అంది ఆ పిల్ల.

అంతా నవ్వుల్లో మునిగిపోయారు కానీ సీతమ్మ గారు ఆ పిల్ల మాటల్లో దృడత్వాన్ని గమనించారు. "ఈ పిల్ల అనుకున్నది సాదిస్తుంది. పట్టుదల ఆ దేవి ఇచ్చే దీవెన కావాలి." అని మనసారా మరోసారి మొక్కుకున్నారు.

"అలాగేలేవే చిన్న సీతమ్మ." అని మాధవ మురిపెంగా అన్నాడు. అప్పటి నుండి కొన్ని వందలసార్లు తన తల్లిని ఆ పిల్లలో చూసాడతను. తన నాయనమ్మ కథల్లో, కబుర్లలో ఎన్నో విషయాలు తెలుసుంటూ, చదువుల్లో, ఆట పాటల్లో రాణిస్తూ ఎదుగుతూంది భవాని. తులసమ్మ పూజలందుకుంటూ పచ్చగా కళకళలాడుతూ ఆ చిన్నారిని దీవిస్తూంది.

*************************************************

చూస్తుండగానే మరో పద్దెనిమిది యేళ్ళు గడిచిపోయాయి. సీతమ్మ గారు పూజల నుండి ధ్యాన మార్గం లోకి వచ్చారు. ఆవిడననుసరించి భవాని కూడా ధ్యానసాధనలోకి మారింది.

ఆవిడ ఓ రోజు తన జీవితం గురించి చెప్పి, తాతగారి చిత్రాన్ని చూపించారు. కోమలి తన తాతగారి వివాహం, వారిని అంగీకరించిన సీత క్షమ, కరుణ ఇవన్నీ ఎలా సాధ్యం? ఇది ప్రేమ చేసే గారడీనా? తన మనిషిని గూర్చిన ఆరాటమా? తన వరకు అనుకుంటే కుంచించుకుపోయే మనసు, తనవారికి అనేసరికి అలా విస్తరిస్తుందా? అందర్నీ కలేసుకుపోయే తత్వాన్ని కలగజేస్తుందా? అనిపించింది.
భవాని జీవితం ఆవిడ జీవితం నుండి యే పోలిక తెచ్చుకోనుందో కాలమే తెలపనుంది. కాలానికి అతీతంగా జీవితాల్లో మార్పు రాని అంశాలెన్నో వున్నాయి. అవి మనసుకి, మమతకి చెందినవి.

భవాని చదువు పూర్తి చేసుకుని, మంచి ఉద్యోగస్తురాలైంది. సీతమ్మ పోలికలు పుణికిపుచ్చుకున్నా ఆధునిక భావాలతో పాటు ఆవిడ నేర్పిన వినయం, పద్దతులు, సాంప్రదాయాలు కూడా అలవరుచుకుంది.

మొదటి జీతం నాటి నుండీ వృద్దాశ్రమాలకి, నిస్సహాయ స్త్రీలకి తన వంతు ఆర్థికసహాయం అందిస్తుంది. పిల్లల్లో చదువుకోవాలన్న ఆసక్తిని కలగజేసే ప్రయత్నాలు, సహాయ కార్యక్రమాలు చేసేది.

సీతమ్మ పంచిన అనురాగమే తన గుండెల నిండా నింపుకుంది. చదువు అవగానే పెళ్ళై ఒక బిడ్డకి తల్లైంది.


పిల్లాణ్ణి చూడటానికి వచ్చిన మేనత్త వొడిలో పడుకోబెట్టి, "మామ్మకి నువ్వైనా చెప్పు అత్తయ్యా? నాతో తీసికెళ్తానంటే రానంటుంది. అమ్మ అశక్తురాలు. మామ్మ వస్తే నాకు తోడుగా వుంటుంది." అంది భవాని.

"బిడ్డ మీద బిడ్డలా నేను వస్తే నీకు ఆటంకమే కానీ ఆసరా ఎక్కడిది తల్లీ.." సీతమ్మ మాట అవక మునుపే "మరదే నిన్ను పనికా తీసుకువెళ్ళేది." చిరుకోపంగా ఆడిగింది.

వెనక్కి తిరిగి వెళ్తున్న మేనకోడల్ని చూస్తూ "అమ్మా ఇది నిజంగా 'చిన్న సీతమ్మే' ఆ వాటం, ఆ జడ అదీ.." అంది మేనత్త.

భవాని స్నానం అయ్యి వచ్చేలోగా సీతమ్మ గారు తన చెవి దుద్దులు తీసి, కడిగించి మనవరాలి చేతిలో పెట్టి "భవానీలు మామ్మ గుర్తుగా పెట్టుకోమ్మా." అన్నారు.

రెండు కళ్ళ నిండా వూరిన కన్నీరు తుడిచే ప్రయత్నం చేయకుండా "మామ్మ నేను నీ బంగారాన్నే ఎప్పటికీను. నీ జీవితమే నాకు కొంగు బంగారం." అంది.

మేనత్త బలవంతంతో ప్రయత్నించినా దుద్దులు పట్టక, ఎదురింటి కస్తూరి అక్క సలహా మేరకి పొగాకు కాడలు పెట్టుకుంది, ఓ వారానికి కాస్త తమ్మి సాగి దుద్దులు పడతాయని.

ఆ సాయంత్రం వచ్చిన బంధువు, వరసకి బావ అయిన గాంధి మేళమాడుతూ "ఏమే చిన్న సీతమ్మ, చెవి వెనకాల పెట్టుకోవాల్సిన ఆ చుట్టలు, చెవిలో పెట్టావేమే. నువ్వూ మీ మామ్మలా తింగర బతుకు బతుకుతావా?" అని నవ్వాడు. అతనికి అలా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట జారటం బాగా అలవాటు.

"లేదు బావ, ఎలాగైనా మా మామ్మ దుద్దులు పట్టించాలని ఈ ప్రయత్నం." అంది చిరునవ్వుతో భవాని.

సీతమ్మ గారి కళ్ళలో తృప్తి, మనసులో ప్రశాంతత. మనవరాలు తన మాదిరి కాదు. మంచి, మన్నన ఎరిగిన పిల్ల, తెలివైనది, తన కాళ్ళ మీద నిలబడ్డ పిల్ల. జీవితానుభవాలు చదివింది. కష్టాలు సుఖాలు చవిచూసినా సమర్థవంతంగా బండి లాగగలదు అనుకున్నారు.

*************************************************

అనుకున్నట్లే సీతమ్మ గారిని వెంట తీసుకుని వెళ్ళింది.

ముని మనవడికి సీతమ్మ గారు మనవరాలికి పాడిన పాట మళ్ళీ పాడుతున్నారు. పనికి తోడుగా వచ్చిన ముత్యాలు కాళ్ళ మీద వేసుకుని నువ్వుల నూనె రాసి కాళ్ళు చేతులు సాగదీస్తుంటే బోసిమొలతో, వేళ్ళు గుప్పిట పెట్టి నోట్లో కుక్కుకుని కిల కిల కేరింతలు కొడుతున్న కొడుకుని మురిపెంగా చూసుకుంటూ, భవాని అప్పటికప్పుడు రాసి, బాణీ కట్టి పాడుతున్న పాట.

మాటా మంతి లేదు,
సిగ్గు ఎగ్గు లేదు,
నోటిలో మాత్రం వేలు,
నవ్వులో మంచి ముత్యాలు,
చెప్పుకు పోతే వేవేలు,
మా చిన్నీ తండ్రికి జేజేలు.

అనుభవం కూడా కొంగు బంగారమే. సీతమ్మ గారి జీవితం, మాధవలో బాధ్యతని పెంచితే, భవానీకి భావికి బాట చూపింది. వారిరువురి జీవితాలు తర్వాతి తరాలకి మార్గదర్శకం. తులసమ్మ కి కుంకుమ పెట్టి, నీరు పోస్తూ నానమ్మ నుదుట కుంకుమ లేని కారణాలు వెదికిన భవాని ఈ నాటికీ తులసిమొక్క పెంచుతూనే వుంది. ఆ మొక్క నాటిన కుండీలోని మట్టిని పవిత్రంగా నుదుట ధరిస్తూనేవుంది.

కథ : నిరంతరం

చీకట్లు వీడని శీతాకాలపు ఉదయపు పొద్దు. అక్కడక్కడా మినుకు మినుకు మంటున్న తారలు చిచ్చుబుడ్డి రవ్వల్లా వున్నాయి. సుమారు ఐదున్నర కావస్తుంది. దాహంగా అనిపించి లేచిన మధుకర్, ప్రక్కన చెస్ట్ మీద వున్న జగ్ లో నీళ్ళు కాసిని గొంతులోకి పోసుకుని, మంచంలోనే తలగడ పైకి సర్దుకుని వొళ్ళో లాప్ టాప్ పెట్టుకుని ముందు ఈమెయిల్స్ తెరిచాడు. శనివారం కనుక ఉదయాన్నే పరిగెట్టాల్సిన పని లేదు.

మైత్రేయి నుంచి రెండు నిమిషాల క్రితం వచ్చింది ఆ ఈమెయిల్.

"కలలోనే తొలి పొద్దు వెలుగులు చూసాను
వెలుగుల నీడల్లో తన రూపు వెదికాను
కలని విడిచి కనులు తెరిచి దోసిలి వొగ్గాను
గుప్పిట పట్టినన్ని కిరణాల నేను తడిసాను
శీతువు పొద్దుల్లో వణికే తనకి వొడి వెచ్చన పంచాను
పసిపాపడిగ తను తోస్తే అమ్మ వొడి నాది కాదా?" - మైత్రి

చిన్నగా నవ్వుకున్నాడు. సాదారణంగా ఉదయం వచ్చే ఈ-లేఖ అలాగే వ్రాస్తుంది. నిజమే కదా తల్లి తర్వాత ఆ స్థాన్నాన్ని నింపేది భార్యేగా. ధ్యానానికి తర్వాత పంపితే యేదో ఒక సందేశం కలుపుతుంది.

"పొగమంచు తెరలో తొలివేకువ ఝామున తూరుపు కన్నియ మత్తుకనులు విప్పనని మారాములు చేస్తుంది.. గారాబు చెలియ కొంగు చాటున తెల్లమొహమేసుకుని అదిగోవాడు.. ఎవరనేం, సూరీడు కాక..వాడిని వెక్కిరించటానికి వెళ్దామంటే చెలి కాలి మువ్వ కి చిక్కుకున్న నా కొనగోరు అడ్డుపడింది." -మధు

అని తిరిగి జవాబు పంపాడు.


తల తిప్పి చూసాడు. వాసవి ఇంకా గాఢనిద్రలోనే వుంది. ప్రశాంతంగా నిదురలో వుంది. ఆరున్నరకి గానీ లేవదు. వేడిగా ఓ కప్పు కాఫీ తాగాలనిపించి, మంచంలోచి దిగి బ్రష్ చేసుకుని క్రిందకి కిచన్ లోకి వెళ్ళాడు.

పాలు కప్పులోకి వంచి మైక్రోలో వేడి చేయటానికి పెట్టి, కిటికీ లోంచి బయటకి చూసాడు. కాస్త తెల్లార వచ్చింది. డెక్ మీద రెండు ఎర్ర రెక్కల పక్షులు, చలికి ముడుచుకుని ముక్కులు మెడకి నొక్కుకుని కూర్చుని వున్నాయి. ఆ వెనగ్గా కరిగీ కరగనట్లున్న స్నో కప్పిన బాక్ యార్డ్. ఆకు రాల్చేసిన మేపిల్ ట్రీ మొదల్లో మఠం వేసి కూర్చున్నట్లున్న బూడిద రంగు కుందేలు.

కాఫీ కలుపుకుని చిన్నగా సిప్స్ తీసుకుంటూ ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్వాదిస్తున్నాడు. సహజంగా భావుకుడైన అతనికి ప్రకృతి ఎప్పుడూ యేదో ఒక స్ఫూర్తినిస్తూనే వుంటుంది.


అలా ఎంతసేపు నిల్చుండిపోయాడో తెలియదు. వెనుక నుండి రెండు చేతులతో చుడుతూ ఆరేళ్ళ రాహుల్ "డాడీ" అనగానే కాస్త తృళ్ళిపడి, చేతిలో కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టి పిల్లాణ్ణి ఎత్తుకున్నాడు. కునాల్ వీ గేం ఆడుకుంటున్నాడు.

వాసవి రావటమే గమనించలేదు. నూనె రాసి ముడిపెట్టిన పొడుగాటి జుట్టు, పసుపు, గంధం పట్టించిన మొహం. ఉప్మాకి వేసిన పోపు ముక్కుపుటాలకి సోకింది.

"వసు, కాసేపు కూర్చోకూడదా. ఇప్పుడేగా లేచావు." అన్నాడు అతను.

"అలాగని మరి దానికీ చెప్పు మధు." గోడ మీద గడియారం వైపు చూపుతూ చిన్ననవ్వు కలిపి అంది.

"ఇవాళ నేహ బర్త్ డే పార్టీకి కి వెళ్ళాలి రాత్రికి. కునాల్ స్విమ్మింగ్ క్లాస్ అయ్యాక, గిఫ్ట్ షాపింగ్ చెయ్యాలి. రాహుల్ కి టేక్వాండో టెస్ట్ ఇవాళ మధ్యాహ్నం మూడుకి. ఇవాళంతా పరుగులే." అంటూ రవ్వ కోసం పాంట్రీ వైపు వెళ్ళింది.

అట్లకాడతో పోపులో ఉల్లిపాయ వేపుతూ, ఒక జీడిపప్పు పలుకు తీసి నోట్లో వేసుకుంటూ "వసు, కాఫీ కలపనా?" అని అడిగాడు.


శనాదివారాలు పిల్లలు కునాల్, రాహుల్ యాక్టివిటీస్ కి తనే ఎక్కువగా తీసుకు వెళ్తుంది. మధు కి వంట చేయటం ఇష్టం. మిగిలిన రోజుల్లో ఉదయం యేడుకి బయటపడే అతను, రాత్రి యేడుకి కానీ ఇంటికి చేరలేడు. అందుకు వీకెండ్ లో వంట పని అతనిది. తప్పనిసరైతే తప్ప బయటకి కదలడు.

అమెరికా వచ్చిన ఈ పన్నండేళ్లలోనూ వాసవి పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు వర్క్ చేయనని నిర్ణయం తో వీలుని బట్టి వాలంటరీ వర్క్ చేయటమే కానీ అంతకు మించి పిల్లల్ని బయటవదలలేదు. మధుకి అన్నిటా అనుగుణంగానే వుంటూ తన మాట నెగ్గించుకునే గడుసరి.

కాఫీ తాగీ తాగగానే పైకి పరిగెత్తింది వాసవి ఆలస్యం అయిపోతుంది అనుకుంటూ. "మధు, వంట యేమీ చేయకు, రెస్ట్ తీసుకో. నీకు నిన్నటి కూరలున్నాయ్. నేను పిల్లలతో లంచ్ బయట చేసేస్తా.." మెట్ల మీద నుంచి అరిచి చెప్పింది.

వాసవి మధుని ఇష్టపడుతుందని గమనించిన, ఇద్దరి కుటుంబాలకీ కలిపి స్నేహితుడైన పాల్ గారి చొరవతో జరిగిన వివాహం వాళ్ళది. మధు స్వతహాగా మితభాషి, బిడియస్తుడు. పెద్దాడు కునాల్ సంవత్సరం పిల్లాడుగా వుండగా వచ్చారు ఇక్కడకి. దాదాపు యేడేళ్ళ గాప్ తర్వాత రాహుల్ పుట్టాడు. అన్యోన్యంగా, ఆనందంగా సాగిపోతున్న కాపురం వారిది.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

మధు వున్న స్టేట్ కి నాలుగు స్టేట్స్ ప్రక్కనున్న స్టేట్ లో పద్నాలుగేళ్ళుగా కాపురమున్న జంట హరి, మైత్రేయి. అదే ఉదయాన అక్కడి ప్రహసనమిది.

ఉదయమే లేచే అలవాటున్న మైత్రేయి ధ్యానం పూర్తి చేసుకుని, అలవాటుగా పంపే వీక్ ఎండ్ ఈ మెయిల్స్ పంపేసి, కాస్త తెరిపిగా వున్న వాతావరణం చూసి అలా కాస్త బయటకి వెళ్ళాలనిపించి పడుకునే వున్న భర్తని లేపటానికి వెళ్ళింది.

"కాసేపలా వాకింగ్ వెళ్ళొద్దాం, లే హరి." భుజం మీద తడుతూ మైత్రేయి అన్నామాటకి "అబ్బా ఈ చలిలోనా?" బద్ధకంగా అటునుండి ఇటు తిరుగుతూ అన్నాడు హరికృష్ణ.

"చిన్నపిల్లాడిలా మారాం చేయకు. మరీ చలి లేదు." కంఫర్టర్ లాగేస్తూ అంది.

"మొండి వదలవు కదా." ముద్దుగా విసుక్కుంటూ దిగి ఫ్రెషప్ అవటానికి వెళ్ళాడు.

సిరి లేచిందేమో చూసొస్తానని ఆ గదిలోకి వెళ్ళింది . మంచి నిద్రలో వుంది. నుదుట మృదువుగా చుంబించి, బెడ్ ప్రక్కనే పడున్న పుస్తకం తీసి సరిగ్గా పెట్టి, తన టెడ్డీని ఇంకొంచం దగ్గరకి జరిపి, తలుపు దగ్గరగా వేసివచ్చింది. కిచన్ లో ఫోన్ పక్కన పోస్ట్ ఇట్ నోట్ మీద వాకింగ్ కి వెళ్ళాం అన్న మెసేజ్ పెట్టింది. సిరి కి అలా అలవాటు చేసారు.

మరో పావు గంటకి ఇద్దరూ బయటకొచ్చారు.

హరికి తీరిక తక్కువ వృత్తి. ఆపై ప్రాక్టికల్ గా అలోచించే మనిషి. ఇతరత్రా వ్యాపకాలు చాలా తక్కువ. మాట్లాడేది తక్కువే అయినా నికార్సుగా వుంటాడు.

మైత్రేయి కి వృత్తిపర వత్తిడి వున్నా వృత్తీతర వ్యాపకాలు, అభిరుచులు యెక్కువే. మాట మెత్తన, మనసు మెత్తన అన్నట్లుగా వుంటుంది. కాస్త భావుకత పాళ్ళు కలిసిన రచనలు చదవటం. స్పందించినపుడు వ్రాసుకోవటం. అతనికి స్పోర్ట్స్, స్టాక్ మార్కెట్ పట్ల మక్కువ. ఆమెకి ఆసక్తి తక్కువ.

ఇద్దరూ మాత్రం కలిసి ఇష్టంగా చేసే గార్డెనింగ్. కానీ ఇంటిపని, బయటపని అతను సగం పైన చేసేస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు అతనికి తెలుసు. అలాగే అతనికి నచ్చని విషయాల్లో వత్తిడి చేయదు. కనుక ఒక విధంగా ఇద్దరూ కాపాడుకుంటూ వస్తున్న సామరస్యం ఆ సంసారానికి మొదటి సూత్రం.

మాట తూలటం తక్కువ, తూలనాడుకోవటం ఇంకా తక్కువ. పరస్పర అవసరాలు గమనించుకోవటం, అవగాహనతో మెలగటం. పెద్దవారు కుదిర్చి చేసిన వారి వివాహం, వాళ్ళ జీవితాల్ని ముడివేసాక ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకుని ఆ స్థాయికి రావటానికి పదేళ్ళ పైనే పట్టింది.


పన్నెండేళ్ళ సిరి ఇద్దరి పోలికలు, లక్షణాలతో పుట్టింది. అందుకే ఇద్దరికీ అదో సరదా, ఒకరినొకరు ఆట పట్టించుకోవటం. "మంచి గుణాలు నావి. అల్లరి నీది" అని అతను, "అదేమీ కాదు, భావుకత నాది, నిక్కచ్చితనం నీది" అని ఆమె మురిపాలు పోతుంటారు. ఆ నడుమ మహా తెలివిగా రాణించేది ఆ చిన్నారి.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

వాసవి దాదాపుగా గంట నుండి మాట్లాడుతున్న ఫోన్ కాల్ అవగానే, కాస్త నిట్టూరుస్తూ వచ్చి మధు ప్రక్కన కూర్చుంది. యేదో చెప్పాలని వచ్చినట్లుగా వుంది. చేతిలోని దిన పత్రిక ప్రక్కనుంచి "యేమైంది?' అని అడిగాడు.

"నీరజ, మురళి విడిపోతున్నారట." కాస్త ముభావంగా అంది. నీరజ వాసవికి చిన్ననాటి స్నేహితురాలు.

"ఏమిటో వినటానికి చిన్నవే అనిపిస్తున్నా దాని మనసు ఎందుకు నొచ్చుకుందో." కాస్త బాధ మిళితమైన స్వరం.

"వసు, అదే పరిస్థితి నీకు వస్తే యేమి చేస్తావు?" ప్రశ్నించాడు మధు.

"చెప్పలేను మధు. నేను సమస్యకి వెలుపల వున్నాను కదా." అంది వాసవి.

"అదే నేను చెప్పాలనుకున్నది. మూడో వ్యక్తికి కనిపించనిదే ఒక ఇద్దరి మధ్య ఘర్షణ. అది సమసిపోయినా, విడదీసినా ఆ ఇద్దరి మధ్య వున్న అవగాహన, సంయమనం, సర్దుబాటు కారణం." అన్నాడతను.

"మళ్ళీ మాట్లాడదాం. కునాల్ క్లాస్ కి టైం అయింది." అంటూ పిల్లల్ని తొందరిస్తూ కదిలింది.

అలాగే కూర్చున్న మధుకి వారం క్రితం తను, మైత్రేయి వైవాహిక సంబంధాల గురించి చర్చించుకోవటం "ఒక్కోసారి విడిపోవటం కూడా సరైన పరిష్కారమేనేమో మధు" అన్న మైత్రి మాట గుర్తుకొచ్చింది.

ఇద్దరి స్నేహం ఇంటర్ చదువుకునే రోజుల నాటిది. ఒకచోటే చదవటం కాకుండా కంబైన్డ్ స్టడీస్ కూడా చేసేవారు. ఒకరి మీద పోటిగా ఒకరు చదువటంతో పాటు, కవితలు, కథలు కలిసి చదవటం, ఆ మీదట కాస్త చర్చలు దాదాపుగా ఆరేళ్ల పైన ఒకేచోట వున్నారు. పెళ్ళి తర్వాత కూడా అదే స్నేహం మొదట్లో ఉత్తరాల్లో, ఆ తర్వాత ఫోనుల్లో, అపుడపుడు కలవటంలో, తరుచుగా జరిపే ఈమెయిల్స్ వలన నిలిచేవుంది.

వాసవి వెళ్ళాక కూడా మధ్యాహ్నం వరకు అదే ఆలోచనల్లో మధు కి మైత్రి పెళ్ళినాటి సంఘటన గుర్తుకు వచ్చింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

పెళ్ళి అయ్యాక అప్పగింతల యేర్పాట్లకి ముందు పందిట్లో విశ్రాంతిగా కూర్చున్న మైత్రి తాతగారు మాధవయ్య ప్రక్కగా వెళ్ళి కూర్చున్నాడు.

ఆమె తల్లి శ్రీలక్ష్మి, తండ్రి రామకృష్ణ ఇంకా హడావుడి పడుతూనే వున్నారు. మైత్రి మావయ్య నాగేంద్ర, అత్తయ్య ప్రమీల పెళ్ళికి వచ్చి వెళ్తున్న బంధువుల వీడ్కోలిస్తూ తిరుగుతున్నారు. అమ్మమ్మ జానకమ్మ గారు కూర్చున్న చోటనుండే అన్నీ పురమాయిస్తూ నేర్పుగా పనులన్నీ సవ్యంగా అయ్యేలా చూస్తున్నారు.

"చూసావయ్యా మా జానమ్మ, ఎంత జాణో. కూర్చునే చక్రం తిప్పేస్తుంది" నవ్వుతూ అన్నారు.

ఆయన చమత్కారపు మాట తీరు అలవాటే కనుక "భలేవారే తాతగారు." అన్నాడు మధు.

"లేదయ్యా, మా పెళ్ళిలో ఇలా అప్పగింతల్లోనే పంతాలు వచ్చాయి. రెండేళ్ళు కాపరానికి పంపలేదు." అన్నారు.

"అవునా తాతగారు. వినలేదెప్పుడూను." అన్న మధు మాటకి బదులిస్తూ, "అవునయ్యా, మాది ఓ రకంగా మేనరికం. జానకి పిన్ని భర్త మా మేనమావ. ఆయన పట్టుదల వల్లే జరిగింది మా పెళ్ళి. జానకి కూడా మొదట్లో ఇష్టపడలేదు నన్ను. తన స్నేహితురాలు పెళ్ళయి పుట్టింట వుందని ఎద్దేవ చేసిందని నన్ను రమ్మని జాబు వ్రాసి, చెప్పాపెట్టకుండా నాతో వచ్చేసింది. ఆ అభిమానంతోనే తను నన్ను అంగీకరించేలా చేసుకున్నాను. " ఆయన పూర్వ స్మృతుల్లో మునిగి మాట్లాడుతున్నారు.

మధుకి ఆపాలనిపించలేదు. అలా అలా ఆయన జానకమ్మ గారి ఇష్టాయిష్టాలు తెలుసుకుని మెలగటం, ఆవిడ కూడా ఆయన పట్ల గౌరవాభిమానాలు పెంచుకోవటం, ఆయన కున్న ఒకటీ రెండు బలహీనతలైన ముక్కోపం, యేకపక్ష నిర్ణయాలని సహనంగా స్వీకరించటం చెప్పుకుంటూ పోతున్నారు.


మధులో ఆలోచన, ఆవిడ అప్పటి సాంఘిక పరిస్థితులకి వెరసి ఆయనతో కలిసి జీవించారా? లేక ఇష్టం కలిగి అదే ప్రేమగా మారిందా?

మైత్రి ని కన్నీళ్ళతో సాగనంపాక మౌనంగా కూర్చుని వున్న జానకమ్మ గారిని కదపాలనిపించక వూరుకున్నాడు.

"మధు, ఇలారా బాబు." అని ఆవిడే పిలిచారు. "కాస్త లోపలికి వంట పాకలోకి వెళ్ళి చిన్నాలమ్మ గారినడిగి ఆయనకి మజ్జిగ తెస్తావా?" అని అడిగారు.

చిత్రం, అంత హడావుడి, మనవరాలెళ్ళిందన్న దిగుల్లో కూడా ఆయన అలవాట్లు మరవలేదావిడ.

మాధవయ్య గారికి మజ్జిగ ఇచ్చి జానకమ్మ గారి దగ్గర కూర్చుని "మామ్మగారు, తాత గారు మీ పెళ్ళి నాటి ముచ్చట్లు నెమరేసుకుంటున్నారు." అన్నాడు.

మైత్రి, హరిల మెడల్లోని కర్పూరపు దండలు తీయించి, గంగిరెద్దుకి వేయించాలని జాగ్రత్త పరుస్తున్న జానకమ్మ గారు "యేమిటటా అల్లుడు మర్యాదలు చాల్లేదని ఇంకా అలక పానుపెక్కుతానంటున్నారా?" నవ్వుతూ అడిగారు.

"ఒకమాట అడగనాండి." అన్నాడు. "కాబోయే పెళ్ళి కొడుకువి, అడుగు మరి, సందేహాలు సహజమే" అన్నారు. మరుసటి నెలలోనే మధు పెళ్ళికి లగ్నం పెట్టారు.

"మరి... మరి మీరు తాతగారిని ఇష్టపడలేదట. ఆ తర్వాత ..." అర్థోక్తిగా ఆగిపోయాడు.

"వూ చెప్పారూ..." అని "అవునయ్యా, ఇద్దరికీ చిన్నతనం. పెద్దవాళ్ళ పట్టింపులు. అలా కాస్త యెడ మొఖం పెడ మొఖం. కానీ ఎంత గడుసువారని. నాకేవి ఇష్టమో కనుక్కుని, నా మనసు మార్చారు. కొన్నేళ్ళకి ఇద్దరికీ మా సమస్యలు మేమే తీర్చుకోవాలి. పెద్దల మాట గౌరవించాలి కానీ ఆవేశంలో వారితో నిలకడ లేని ఆలోచనలు పంచుకోకూడదు. మాట తూలటం ఆయనకి అలవాటైనా, ఆ క్షణం నాకు సహనం కావాలి. అభిప్రాయాల్లో పట్టు విడుపు వుండాలని అర్థం అయింది. అయినా నిర్ణయాల్లో మాత్రం తనదే పై చేయి. అక్కడ నాది సర్దుబాటు. ఈ రోజు శ్రీలక్ష్మి, నాగేంద్ర ఇంతా హాయిగా కాపురాలు చేసుకోవటానికి మా పెద్దల పట్ల మా గౌరవాలు, మా ఇద్దరి నడుమా వున్న అవగాహన కారణం." అంటూ తృప్తిగా చెప్తున్న ఆవిడలో మధుకి పరిపూర్ణత గోచరించింది.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఫోన్ మోగటం తో ఈ లోకం లోకి వచ్చి ఆన్సర్ చేసాడు.

"మధు, నేను మైత్రి." అటు నుండి పలకరింపు స్వరం.

"నీ గురించే అనుకుంటున్నాను" అన్నాడు మధు.

అలా ఆ సంభాషణ నీరజ విషయం మీదిగా మైత్రి అమ్మమ్మ, తాతగార్ల పైకి మళ్ళింది.

"అవును మధు, నాకు చాలా ఆశ్చర్యం గా వుంటుందెపుడూను. ఆయనలా తాటాకు మంటలా ఎగిసి పడతారా, అంతలోనే 'నీ మాటేంటో చెప్పు' అని చిన్న పిల్లాడిలా అమ్మమ్మ నోటితోనే అసలు నిర్ణయం రప్పిస్తారు. చివరికి ఇద్దరిదీ ఒకటే మాట." అంది నవ్వుతూ.

"బహుశా వాళ్ళు తన భాగస్వామి ఇలా వుండాలన్న ఆశింపుతో వివాహ బంధంలోకి రాలేదేమో మైత్రి. కలిసి జీవించాకనే ఒకరినొకరు మలుచుకున్నారేమో." అన్నాడు మధు.

"అలా అయితే మరి మా జేజమ్మ విషయం అలా కాదుగా మధు." అంటూనే మైత్రి కాస్త గొంతుకేదో అడ్డం పడ్డట్లు ఆగిపోయింది.

"ఊ, వూరుకో మైత్రి. అనవసరం గా అవన్నీ కదిపానా?" అని అడిగాడు. మైత్రి అలా చలించిపోవటం అతనికి కొత్త కాదు.


"లేదు మధు, చెల్లీ అంతేగా. తన ఆలోచనలు తను దాచేసుకుని, భర్త దురాగతాలకి తలవంచే కదా అలా అర్థాంతరంగా మరణించింది. ఈ కాలం లో వుండి కూడా తన జీవితానికి తను న్యాయం చేసుకోలేకపోయింది. సర్దుబాటుకీ ఒక హద్దు వుంది. అది ఇద్దరికీ ఆపాదించాల్సిన నియమం అని ఎందుకు తను తెలుసుకోలేకపోయిందో.." అని "అందుకే అన్నాను ఆ మధ్య, విడాకులు తప్పని సరైనపుడు దాన్ని నేను సమర్థిస్తాను అని" భారంగా అంది.

కాసేపు మాట మళ్ళించి ఆమె కాస్త తేరుకున్నదనుకున్నాక ఫోన్ పెట్టేసాడు.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

మైత్రి ఆలోచనలు తన స్వానుభవాల వైపు మళ్ళాయి. పూర్తి వైరుధ్య స్వభావాలు తనవి, హరివి.

అనుభూతులు సంపదలుగా తన జీవన విధానాలు. ప్రతి నిమిషం వెల కట్టినట్లు గడపటం హరికి అలవాటు. మొదటి నుండీ
Don't wash your dirty laundry in public అన్నది ప్రధాన సూత్రంగా మెలిగినా, ఇరువురి నడుమా ఎన్నిసార్లు ఘర్షణలు. వాదోపవాదాలు.

మధ్యేమార్గం ఇద్దరూ పాటించాలని, ఒకరినొకరు పూర్తి ప్రభావితం చేయకూడదని
గట్టి నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి వుండడానికి ఇద్దరిలోనూ దృఢసంకల్పం రావటానికి ఎన్నో యేళ్ళు పట్టింది. ఇన్నిటా తమ మధ్య బంధాన్ని ఆపింది కేవలం మూడు ముళ్ళూ కాదు, సమాజమూ కాదు. తమరిరువురిలోని ఆలోచనలు, అదుపు తప్పని ఆవేశం, పరస్పర అనురాగం కారణం. అవే మనస్తత్వాల రాపిడిని ఆపాయి.

తనలోని భావుకత ఎప్పటి మాదిరే ఆ అభిరుచి వున్న మధు వలన పరస్పరం ప్రోత్సాహించుకుంటూ, విమర్శించుకుంటూ సాగుతుంది. మధు కి తను వాసవికి తగిన జోడు కాదేమో అన్న ఆలోచన ఒకసారి తనతో పంచుకున్నాడు. వాసవి చురుకుదనం, ఇతర వ్యాపకాల్లో అతను తను సరికాదేమోనన్న విధంగా ఆలోచించాడు. సాఫీగా సాగిపోతున్నా తన వలన యేదైనా వెలితి వుండివుండవచ్చేమోనని మైత్రితో ప్రస్తావించాడు.

"మధు, యే ఇద్దరూ ఒకేలా వుండరు. ఇద్దరి జీవితం ఒక త్రాటి మీద నడవాలంటే ఇద్దరికీ సర్దుబాటు గుణం కావద్దా? వాసవి కూడా నీ పట్ల ఒక అవగాహనకి వచ్చేవుంటుంది. తననే అడిగి చూడు. ఇలా నాలా మూడో మనిషి మాటకి తావీయకు." సున్నితంగా హెచ్చరించింది తను.

ఆ తర్వాత ఎప్పుడూ తమ మధ్య వైవాహిక సమస్యల ప్రస్తావనలు రాలేదు. వివాహ జీవితాలు, చుట్టూ గమనిస్తున్న పరిణామాలు అప్పుడప్పుడు చర్చించుకోవటం మాత్రం జరుగుతుంది.

జేజమ్మ, అమ్మమ్మ, తన తల్లి తరంలోని ఒకరిద్దరు, మొదటి వివాహంలో శారీరక హింసకి గురై, విడాకులతో బయటపడి, తనమాదిరే ఒంటరైన వంశీని రెండవ వివాహం చేసుకుని హాయిగా వున్న దేవిక, ఇప్పుడు నీరజ ఇలా ఒకరి తర్వాత ఒకరు మైత్రి ఆలోచనల్లో తారసపడతున్నారు.

ఈ వ్యవస్థలో రక్షణ, స్వేఛ్ఛకి వెసులుబాటు వున్నాయి. తరం వెనుక తరం అనుసరణలు మారుతున్నాయి. అన్నిటా సహచర్యం సాఫీగా సాగిపోగల దిశగానే జంటలు నడుస్తున్నారు. ఎందులోనైనా అవుట్ లయ్యర్స్ తప్పవు. ఇక్కాడా ఇంతే అని నిట్టూర్చింది.


ఆలోచనలు కట్టి పెట్టి, డిన్నర్ కి వంట చేద్దాం అనుకుంటూ కిచెన్ వైపు నడిచింది. చపాతీకి పిండి కలుపుతుండగా హరి ఫోన్. "మైత్రి, సిరి మెక్సికన్ రెస్టారెంట్ కి వెళ్దామందిగా. నేనొక అరగంటలో వస్తాను. మీరు రడీగా వుండండి." అంటూ. "అదికాదు హరి .." అంటుండగానే "యేది కాదురా, సిరి గాడి ఆర్డర్ మేమ్, నాది కాదు కనుక మన రూల్ ఇక్కడ వర్తించదు." అతని గొంతులో ఆట పట్టిస్తున్న ధోరణి.

చిన్నగా నవ్వుకుని కలిపిన పిండి ఫ్రిజ్ లో పెట్టేసి, కామిక్ బుక్ చదువుతున్న సిరిని పిలిచి తయారు చేసే ప్రయత్నంలో పడింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

రాత్రి వెళ్ళాల్సిన బర్త్ డే పార్టీకి గిఫ్ట్ కొనటానికి వెళ్తూ, కునాల్ ని దార్లో లైబ్రరీ దగ్గర దింపి, అక్కడ కలిసిన సరితకి తమ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేసి, అప్పగించి రాహుల్ తో మాల్ కి వెళ్ళింది వాసవి. అక్కడ ప్లే యేరియాలో ఆడుకుంటానని మారాం చేసి ఆపేసాడు. ప్రక్కనే వున్న చైర్స్ లో కూర్చుని పది నిమిషాలు ఆడుకోమని పంపింది.

ప్రక్కనే భార్యా భర్తల్లా వున్న ఇద్దరు కాస్త ఘర్షణ పడుతున్నారు. గొంతులు తగ్గించి మాట్లాడుతున్నా కాస్త అర్థం అవుతుంది. షాపింగ్ లో అనవసరమైనవి కొన్నదని అతని వాదన. ఆ ఆమ్మాయి నువ్వెప్పుడూ ఇంతే అని అలా అలా ఎప్పటెప్పటివో ఎత్తి మాట్లాడుతుంది.

ఎందుకో మధు గుర్తుకొచ్చాడు. ఒకసారి తనే అడిగింది. "నేను యేమి కొన్నానో కూడా పట్టించుకోవా?" అని.

"వసు, అది ఇద్దరం చర్చించాల్సిన విషయమా. అవసరాలు తెలియని మనిషివా?" అని నవ్వేసాడు.

నిజానికి ఎప్పుడూ అతని పూర్తి అభిమతం కనుక్కోవాలని తను ప్రయత్నించిందా? స్వగతం గా అనుకుంది.

ఇష్టపడింది, పాల్ గారు కదిపి పెళ్ళి చేయించారు. మధు కి సర్దుకుపోయే తత్వం. మొహమాటం. సాఫిగా సాగిపోతున్న విషయాన్ని కదపని తనం. ఆ స్వేఛ్ఛ అతను ఇవ్వబట్టే తను ఇంతవరకు పెద్ద తర్క వితర్కాలు చేసే అవసరం రాలేదు. ఇప్పటి వరకు ఒక్కసారీ అతని కవితలు కానీ, ఇతర రచనలు కానీ తనని చదవమని బలవంతం చేయలేదు. తను యేడిపించటానికి మైత్రిని, అతన్ని కలిపి కవి సమ్మేళనం పెట్టుకుని, మీకు మీరే సన్మానాలు చేసుకోండి అన్నా నవ్వుతూనే తప్పా యేనాడూ తిరిగి తన పద్దతులనేమీ ఎత్తి చూపడు.

అవునూ ఎందుకు తనీవాళ ఈ ఆలోచనలో పడింది. తనకు తనే ప్రశ్న వేసుకుంది. బహుశా నీరజ తో జరిపిన సంభాషణ తాలూకు ప్రభావమేమో. ఇన్నేళ్ల తన వైవాహిక జీవితసావాసం యేనాడు శృతి తప్పలేదు. ఇకపై కూడా అది సంభవించదు. మనసులో యేదో విశ్వాసం.

ఇంతలో మధు ఫోన్ ఇంకా రాలేదేమిటని. రాహుల్ ని తీసుకుని ఇంటికి బయల్దేరింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

నిజమే ఎన్ని తరాలు మారినా వివాహవ్యవస్థ బలంగా నిలిచేవుంది. భాగస్వాముల నడుమ అవగాహనలో కుటుంబం అన్నది చెదరక సాగుతూనే వుంది. అర్థవంతమైన సర్దుబాట్లలో అది బలపడి ఆ తరానికి ఆ తరానికి స్థిరపడనున్నది. అపుడపుడు ఒక తడబాటు చవిచూస్తున్నా, విడిపడిన జంటలు మళ్ళీ క్రొత్త తోడు వెదుక్కుంటున్నాయి. ఆ మారు పయనంలో గమ్యాన్ని చేరుకుంటున్నాయి. ఆ బాంధవ్యం ఇకపై కూడా ఇలాగే జంటల్ని కలిపుంచి తరతరాలకీ నిలవనున్నది. ఇది నిరంతరం చివురులు వేస్తున్న కల్పవృక్షం.

విశ్వామిత్ర - సమాప్తం

మిత్ర వర్క్ అయ్యాక లైబ్రరీకి వెళ్తూ, గిల్డా కి కాల్ చేసింది వస్తావా అంటూ. ఇద్దరూ కలిసి వెళ్ళటం అప్పుడప్పుడూ అలవాటే. మామూలుగా మాట్లాడుతున్నా మిత్ర కళ్లవెనుక కదలాడుతున్న ఆలోచనలు గమనించిందో లేక తను యధాలాపంగా అడిగిన ప్రశ్నకి మిత్ర స్పందించిందో ..

"మీట్రా, ఈజ్ ఎవ్రీ తింగ్ ఫైన్?" గిల్డా మాటకి మిత్ర కళ్లలో నీళ్ళు చిప్పిల్లాయి. తలవూగించిందే కానీ మాట రాలేదు.

"ఓ హనీ" మిత్ర చేతి మీద తన చెయ్యి వేసి సన్నగా నొక్కి "నాట్ ష్యూర్ వాట్స్ బాదరింగ్ యు, హోప్ ఇట్స్ నాట్ టూ సీరియస్.." అర్థోక్తిగా ఆగిపోయింది గిల్డా.

"గిల్డా, ఐ బీ ఫైన్.." మిత్ర తెప్పరిల్లి సన్న గొంతుతో చెప్పింది. విశ్వతోనే చెప్పాలనుకున్న భావనలు అలా వెలికి రాకుండా ఆగాయి. అవే మాటల్లో జాలువారి అతనికి చేరితే ఇలా వుంటాయి.

- నిను చేరక నేనుండలేను

జీవించడానికే ప్రేమిద్దాం
ప్రేమించడానికే జీవిద్దాం
ఈ మార్గానే ప్రయాణించాను
బీడు భూములు దాటాను
మోడు నీడల నిలిచాను
వాగు పొంగున ఈదాను
హరిత వనాల హసితనయ్యాను

రాళ్ళు, ముళ్ళు దర్శించాను
ఫలపుష్ప రంగుల ఆదమరిచాను
రెక్కల జోరు విన్నాను
అడుగుల జాడ కన్నాను
పయనం అన్వేషణైంది
పరుగుల ఆరాటమైంది

ఎగువ దిగువ ఎంచలేదు
వేగం పెంచటమాపలేదు
ఊర్ధ్వముఖమైంది చలనం
వూపిరి సలపని గమనం
కాలం లెక్కలు విడిచాను
చివరి మజిలి చేరాను
శిఖరాగ్రం కాంచాను

పుడమి గుండె పగులువారినా,
ఎదలోతుల ప్రేమ చెలమ పదిలమవదా!
గరికకాడ వెన్ను విరుచుకు నింగికెగిసినట్లు,
నాలోని నీకై నా నిరంతరాన్వేషణ సాగదా!
నీవున్న తావుల జాడకై మరిన్ని బీటలై విచ్చనా,
ఆ నడుమ పాయలై నిను చేరగ నాప్రేమసాగరాన్ని చీల్చనా!

ఆమె భావుకతని ఆరాదించే అతనికి తన భాష్యాలు సగమే అర్థమౌతాయని ఆమెకి తెలుసు. ఇంగ్లీష్ ఎక్కువగా వాడే అతనికి కవితల పట్ల అభిలాష, మక్కువ ఆమె పట్ల ప్రేమ కలిగించినవే.
********* ********* ********* ********* *********

తలస్నానం చేసిన జుట్టుకి చుట్టుకున్న టవల్, ఒక చేతిలో విశ్వ ఇచ్చిన ప్రేమలేఖల (వంటి) పుస్తకం. విశ్వ ఆ సాయంత్రం వచ్చినపుడు తలుపు తీసిన మిత్ర వాలకమది. విశ్వకి కొంచం ఆశ్చర్యం వేసింది.

సాధారణం గా మిత్ర శనివారం ఉదయాన్నే తలస్నానం చేస్తుంది. నియమానుసారం జీవితం గడిపే ఆమె గురించి అతనికి తెలిసిన విషయాల్లో అదొకటి.


"మిత్ర, కాసేపలా బయట వాక్ చేసివద్దామా?" అతనడిగిన ప్రశ్నకి తల అడ్డంగా వూగించి "విశ్వ నాకిక్కడే వుండాలని వుంది." అంది.

విశ్వకి యేదో మార్పు తోస్తుంది. మిత్ర వాకింగ్ రాననటం చాలా అరుదు.

దాదాపు నాల్రోజులుగా కాల్ కూడా చేయలేదు. తను లాండ్ లైన్ కి చేస్తే అన్సరర్ కి వెళ్తుంది. సెల్ ఫోన్ అంతే వాయిస్ మెసేజ్ వస్తుంది. బిజీగా వున్నపుడు కూడా తనలా వుండదు.

సోఫాలో కూర్చున్న మిత్ర వళ్ళో తలపెట్టుకుని పడుకున్న విశ్వ అలాగే ఓ పది నిమిషాల వరకు మాట్లాడకుండానే వుండిపోయాడు.

"మిత్ర, ఐ యాం సారీ." నెమ్మదిగా అన్నాడు.

"కన్నా ఇపుడా మాట ఎందుకు?" మిత్ర అనునయంగా అడిగింది.

"మిత్ర, నీ మౌనం నన్ను నిలదీస్తున్నట్లుగా వుంది. నా పరంగా యేదో జరిగింది కదూ?" అతనడిగిన తీరుకి మిత్రలో చిన్న కదలిక.

విశ్వ మాట పొడిగించాడు, "అమ్మలు, ఈ రోజు ఉదయం డ్రైవ్ చేస్తూ రేడియోలో విన్నానిది. ప్రేమించటానికే కాదు, ప్రేమని స్వీకరించటానికి మనసుండాలట. నాకు..నాకు అది లేదేమో, నీ అంతగా నన్నెవరూ ప్రేమించలేదు. నాకు అందుకే అందులోని లోతు తెలియటం లేదా? నేను నీ ప్రేమని రెసిప్రొకేట్ చేయలేకపోయానా? నిన్ను కోల్పోతున్నానా?"

అతనడిగిన తీరుకి మిత్ర కి ఆ క్షణంలో అతను ఆటబొమ్మ విరగ్గొట్టుకున్న పసిపాపలా తోచాడు.


నెమ్మదిగా అతన్ని పైకి జరిపి, అతని మెడ చుట్టూ చేతులు వేసి మొహం అతని కుడి భుజం మీద ఆన్చి "కన్నా అలిసిపోయాను. తెలిసిన నీలో నాకే తెలియని మరేదో వెదుకులాడుతూ అలిసిపోయాను." నెమ్మదిగా అంది.

"నువ్వు బాగా అనలైజ్ చేస్తావు కదా. చెప్పు ఎందుకు నాలో ఈ సంఘర్షణ?" అడిగింది.

"అమ్మలు, వచ్చేముందు మన గురించే ఆలోచిస్తూ ఒక ఈ మెయిల్ పంపాను చూడు. నీ కళ్ళలోకి చూస్తూ చెప్పలేను." అన్నాడు.

Just like the way you look for messages from god for any occurrence in your life, not really similarly I got a tendency to analyze things. Our journey has brought us closer. Just felt like trying to analyze the journey.

Fate has brought us together. We both had roles in that, but I played major role in getting you from the shell you locked your self in. You resisted it for a long time.

After all that, some thing has touched your nerves, changed you, you opened yourself, you experienced kaleidoscope of emotions. Physical feelings were also thrown into mix. The ones you fought the most.


As you were going through all this, introspection started on how did it happen? who was responsible? how is this change possible? what happend to all my control? why am I feeling like I am in a spell?

ఇలా సాగిన ఆ ఈ మెయిల్ లో అతను తన మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నట్లుగా అనిపించింది మిత్రకి. ఆమె అతని పట్ల యేర్పరుచుకున్న సాప్ ఫీలింగ్స్ కూడ వివరణ వుంది. ఆ భావనలతో ఆమె పడుతున్న వేదన త్రుంచాలన్న అతని ఆరాటముంది. జీవితం పరిచిన పరుధుల చిత్రీకరణ వుంది. తమ పయనం సాగాల్సిన వైనం వుంది. చివర పేరా చదువుతూ...

You have a willing partner who wants to keep
you happy, content and relaxed, enjoying each moment of life to the fullest for rest of your life.

It is on me to protect our relation, I stand by that. Each episode we go through is cementing our relation further.

From the reasons you are against the marriage, I see physical is one among them. I know that your love is beyond physical. I was absolutely sure of that.

I have told many times that is what I think of you. Physical factor is one dimension of whole thing, as we have not attained that, we will be restless until then. In a man-woman relation, that is the last bastion and it takes a lot to happen between their souls, before they offer themselves to the other person. We are reaching that stage.


ఆ పంక్తుల దగ్గర ఆగిపోయిన మిత్ర నెమ్మదిగా లేచి వంటగదిలోకి నడిచి గ్లాసులోకి నీళ్ళు తీసుకుని చిన్నగా సిప్ చేస్తూ నిలుచుంది. ఇంక అతని మనసు విప్పి చూడాలనిపించలేదు. తన మనసే మరొక కోణంలో నుంచి మరొక భాష్యంలో చదివినట్లుగా వుంది.

వెనగ్గా వచ్చిన విశ్వ వెనక నుండి ఆమెని చేతులతో చుట్టేసాడు. గ్లాసు ప్రక్కన పెట్టి తల వెనగ్గా వాల్చి అతని గుండె లయ వినపడేంత దగ్గరగా జరిగి పూర్తిగా అతనికి ఆనుకుని "కన్నా, ఇవి నా మాటలు కాదు. ఈ మధ్య ఒక కొలీగ్ పెళ్ళి శుభలేఖలో చదివి గుర్తుంచుకున్నవి..

Two lives, two hearts,
joined together in Friendship
united Forever in love

Neither of us can honestly say that we were looking for each other,
But it happened.....

We've known each other by CHANCE, became friends by CHOICE.....
still friends by DECISION....

And here were are.... two lovers by SOUL, Just happy being together,

Not knowing where to go, But very sure, that wherever it is.....
We'll be going together "

మంద్రస్వరం తో యేదో లోకంలో వున్నట్లుగా అంటున్న మిత్ర మాటలు పెళ్ళి మంత్రాల్లా తోస్తున్నాయి.

"నాకు నీ స్పర్శ కావాలి, నీ ఒడి కావాలి, నీ గుండె చప్పుడు జోల కావాలి. ఇపుడు నా మనసు ఆకాశగంగ అంత అమృతంగా, తనువు పాలధార అంత మధురంగా మారినట్లుగా వుంది . నాకు కోరికలు చాలా తక్కువ, వున్నా అవి ఎవరికీ అర్థం కావు. ఇప్పుడు త్రివేణి సంగమంలో స్నానంచేసి, కళ్యాణ శ్రీనివాసుని సన్నిధిలో, వెదురు పుష్పం మీద పవళించి, నీలో కరగాలని వుంది. నువ్వు, నా మనసుకి అధిపతి, తనువుకి సర్వాధికారివి, నా ప్రేమకి పిపాసివి, నా చూపుకి బానిసవీ అయిన ఈ ఘడియల్లో నేను నీ పూజకి విచ్చుకుంటున్న నాగమల్లిని.." ఆమె పెదాలని మూసేస్తున్నంత దగ్గరగా విశ్వ పెదాలు.

"అమ్మలు, ఇంక చాలు." విశ్వ మాటలు అతని అధరాలు తెలిపాయి.

కాసేపటికి ఇండియా కాల్ చేసి మిత్ర తాతయ్య గారికి, విశ్వ తండ్రికి తమ నిర్ణయం తెలిపాక ఇద్దరి లో తెలియని ఉద్వేగం. మిత్ర కి మొదటి నుండి అట్టహాసంగా పెళ్ళి చేసుకోవాలని లేదు. తాతగారికి తన మనసులో మాట చెప్పింది. ఇక్కడే గుడిలో పెళ్ళి చేసుకోవాలనున్నదన్న ఆమె అభీష్టాన్ని ఆయన కాదలేదు. విశ్వ ఇంటి నుండీ యే అభ్యంతరం రాలేదు. త్వరలో ఇద్దరం కలిసి వస్తామని చెప్పారు.

తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నది చాలా తక్కువ. తమ విభిన్న మనస్తత్వాలు, పరస్పరావగాహన, ప్రేమ, ఆకర్షణ ఇలా ఒక్కొక్క పరీక్షని తట్టుకుని ఒకటి కానున్న ఆ శుభతరుణం ఇద్దరికీ చాలా మధురంగా తోస్తుంది.

ఇద్దరిలోనూ ఒకరి కొరకు తమలో తెలియకుండానే మార్పు సంభవించింది. అది ప్రేమ చేసిన గారడీ. ఒకరినొకరు మార్చే ప్రయత్నం చేయకూడదని ప్రమాణం చేసుకున్న వారిరువురు తమకి తెలియకనే చేసుకుంటున్న ఆ సర్దుబాటు వారి జీవితాలకి ఆయువుపట్టు. ఒకరి తప్పిదాన్ని ఒకరు క్షమతో సరిదిద్దుకోనున్న ఆ రాజీ మనసు విజయానికి ప్రతీక. అక్కడ మ్రోగుతున్న ఆ మంగళ వాయిద్యాలు వారి హృదయాల చిరు స్పందనల సవ్వళ్ళే.


********* ********* ********* ********* *********

ఆఫీసులో టీంకి వార్త తెలిపి ఒక వారం సెలవు తీసుకున్నారిద్దరు.

అనుకున్నట్లుగానే గుడిలో పెళ్ళి చేసుకుని తిరిగి వచ్చారు.

ఒకరిలో ఒకరు ఒదిగి పోవటానికి, ఒకరినొకరికి అర్పించుకోవటానికి, ఒకరిలోనొకరిని కలిపేసుకోవటానికి ఆ మధుర క్షణాలకోసం వేచి వున్న వారి సమాగమం, దేవుడు నిర్ణయించిన సమయంలో జరుగబోతున్న ఆ శోభనం వారి అనురాగ సంగమంలో శ్రీకారం చుట్టుకున్న తొలి పుట.

మరోసారి తలారా స్నానం చేసి, తెలియని బిడియపాటుతో తడబడుతూ చుట్టుకున్న చీరలో, స్వాతిముత్యం లా ఎదుటికొచ్చి నిలబడిన మిత్ర విశ్వ కౌగిలిలో బందీ అయిపోయింది. అనుభూతులు కలతోడుకుంటున్న మనసు మూటగట్టుకున్న ఆ ప్రణయపు పరిమళాలు..

"ఈ రేయి నా ఉల్లం ఝల్లుమంది, ఒడలు వొణికింది, తనువు తీపిగాట్లతో తెల్లారేవరకు తబ్బిబ్బైంది. చెమరింపుల్లో తృళ్ళిపడింది, అలవోక నవ్వుల్లో మునకలేసింది. నునుసిగ్గు వరదలో మునిగిపోయింది. విల్లో, వీణో ఆ రెండూ కాని మరేదో నా వంటి రూపిపుడు.

గుండె జారిపోయింది, కాని తన సడి దుంధుబి వలే, డమరుకం వలే ఇంకా వినిపిస్తూనేవుంది. వలువలు వంటిపై వుండమంటున్నాయి, వడుపుగా పక్కకి తొలుగుతున్నాయి. ఎంత చిక్కబట్టుకున్నా ప్రాణం నీ దరికే పరుగులు తీస్తోంది. ఏదారిన వెళ్ళను? నా వాటిని తిరిగి పోగేసుకోను? ప్రకృతంతా ఈ నీ స్త్రీలోనే ఆవిష్కరించినట్లుంది. నిన్ను వూహల్లో ఎన్నో రూపాల్లో నిలిపాను, నీవు ఇంకా క్రొత్తగానే వున్నావు.

కన్నా, ఒక్కసారి ఆ గుట్టు విప్పేయనీ నువ్వూ నిజంగా నల్లనయ్యవేనని, అందులోనే నీ అందం దాగుందని. వురుముకి బెదిరే నన్ను చుట్టూ చేయి వేసి పొదివిపట్టే వేళ సిరిగంధపు చెట్టుని చుట్టిన నల్ల త్రాచు కాదా ఆ కరం. అది అందిన నాది కాదా వరం.

గోరువెచ్చని పొద్దులో వున్న వెచ్చదనం నను హత్తుకున్న నీ మేనిదా క్షణం. ఆ అభయంలో ఎంత భరోసా, జగద్విజేతకైనా సాధ్యమా నా ధీమా?

నిదుర రాని నిశీధుల్లో, నిట్టూర్పు వేకువల్లో, నిలదీసే ఏకాంతాల్లో, నిలవరించలేని వేదనలో నీకై లేఖలు పంపగా పదాలు ఇమ్మని ప్రతి సడిని వేడాను. ప్రేమికనై యాగాలు చేసాను. దక్కిన నిన్నే తిరిగి తిరిగి వరంగా కోరుకున్నాను. నీ ఒక్కడి కోసం నేను కోటి హృదయ గీతాలు వ్రాసాను. నన్నే శ్రోతని చేసుకుని నీకై గానం చేసాను, సాధన వలని ప్రేమ ఆలాపన ఇది.

నా కోసం కవితలల్లి, నా కన్నీట నీవూ కరిగి,నీ బాణిలో కథలల్లి,
నా నవ్వులో నీవూ కలిసి,నా కవితకి స్ఫూర్తివై,
నా అనుభూతిలో నీవూ తడిసి,నీ వాణిలో తేనెలునింపి,
నా బాధలో నీవూ గడిపి,నా తోడువై మెసిలి,
నా నిట్టూర్పులో నీవూ ఎగిసి,నీ కౌగిలితో కమ్మేసి,
నా వొడి నీవూ దోచేసి,నా ఉనికి నాకిక వద్దని,
నీ వినా నే మనలేననిపించిన నా ఆత్మబంధువా,
నీ నా బేధమిక లేనేలేదని మనవైక్యమైన ఆత్మలని నేడు చూపవా?
ఆత్మసంగమం అయిన అస్థిత్వంలో తనువు కలయిక అనివార్యమని, ప్రియా,
ఆ పడుగుపేకల మధురిమల మేళవింపే నాకు నీవిచ్చే కానుకని నిరూపించవా?


నీ చెంత నేను కలువల నవ్వుని నా సరసన నీవు నెలరాజువి. మన సావాసం రాగ భరితం మన కలయిక భువికి దివికీ నిత్య వాసంతశోభ.

నిన్నటి గూట్లో పదిలంగా దాగిన గువ్వ నా మది.
రేపటి వలలోకి కలల కడలిలోకి లాగినవాడివి నీవె కదా!
మన వేదం మన సాంగత్యం, మన పయనం మరో ప్రేమ ప్రస్థానం.
మనమిరువురం బహుదూరపు బాటసారులం, సవాళ్ళకొగ్గని సహవాసులం."

విశ్వ వక్షస్థలం మీద తృప్తిగా నిదురపోయిన మిత్ర మర్నాడు ఉదయం కాస్త అలాస్యంగా లేచేసరికి విశ్వ లేవటం, ముందు గదిలో కూర్చుని వుండటం కనపడింది. స్నానం చేసి అలవాటుగా మొలకలు తీసుకోబోయి, మనసు మార్చుకుని ఒక కప్పులో కాఫీ కలుపుకుని "విశ్వ నువ్వేమి తాగుతావు?" అని అడిగింది. విశ్వకి ఉదయాన్నే కాఫీ అలవాటు.

"నీ అధరామృతం" అన్న ఆ సూటి సమాధానానికి చిరుసిగ్గు కమ్మేసి "పో దొంగమొహం నాకు తెలియని కళలు చాలా వున్నాయి నీలో." మురిపెంగా అంటూ అతన్నానుకుని కూర్చుని యేమిటి వ్రాస్తున్నాడా అని కుతూహలంగా చూసింది.

"ఓ అందాల రాణి
నా వలపుల బోణీ
ఓ సుగుణాలా రాణి
నా హృదయపు అలివేణి
నీ మనసు వెన్న
నీ సాంగత్యం నా అదృష్టం
నీతో గడిపిన సమయం నాకు మృదుమధురం
జన్మ జన్మల మన అనుబంధం అపురూపం!"

చదవటం పూర్తి చేసి, విశ్వ బుగ్గమీద మీటి నవ్విన మిత్ర నవ్వు తెరతెరలుగా, పూల జల్లులు కురిసినట్లుగా విశ్వకి శీతల పవనాల మాదిరి తాకింది. అదే అతని తొలి ఆశుకవిత.

విశ్వ,మిత్ర - వారి జీవితాలే వారి పయనం. ఒకరి ప్రేమ అన్వేషణ ఆఖరి మజిలీ మరొకరు. గలగల గోదారి మిత్రవింద. తనని తాను ఆమె ప్రేమలో ఆవిష్కరించుకున్న మౌనమూర్తి విశ్వనాథ్. విశ్వామిత్ర ప్రేమైక జీవన ప్రతినిధులు.

మనం ఒకరికొకరం వరాలం.
తరతరాల ప్రేమ చరిత్ర ఇది.
మనం మనకు అపురూపాలం.
ఇహపరాల ఆత్మ సంయోగమిది.

అని జీవనగీతం పఠిస్తున్న ప్రేమికులు.

[సమాప్తం]